టిడిపి ఏలూరు నియోజకవర్గం ఇంచార్జ్ బడేటి చంటి
విశాలాంధ్ర – ఏలూరు: లక్ష్మీపురంలో ప్రభుత్వం ఇచ్చిన జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జగనన్న కాలనీ స్థితిగతులను పరిశీలించడానికి టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ బడేటి చంటి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గత 3 సంవత్సరాల క్రితం ఏలూరుకు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దెందులూరు నియోజకవర్గం సరిహద్దులో ఉన్న లక్ష్మీపురం గ్రామ నందు ఏలూరు ప్రజలకు జగనన్న కాలనీ పేరుతో ఖాళీ స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆ ఖాళీ స్థలాల్లో ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి ఒక్కొక్క లబ్ధిదారు రూ. 35వేలు చెల్లించాలని డ్వాక్రా సంఘాల ద్వారా ఒత్తిడి చేసి వసూలు చేశారు, కానీ నాణ్యంలేని కట్టడాలు అసంపూర్తిగా నిర్మించడం వలన ఇప్పటికే కొన్ని కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆరోపించారు. లక్ష్మీపురం గ్రామం నుండి ప్రతిరోజు పనుల నిమిత్తం ఏలూరు వచ్చి వెళ్లాలంటే సుమారు రూ.400 లబ్ధిదారులకు ఖర్చు అవుతున్న కారణంగా ఆ కట్టడాల ప్రదేశం వద్దకు కూడా లబ్ధిదారులు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసంపూర్ణంగా ఉన్న ఇళ్లను ప్రభుత్వమే అన్ని వసతులతో నిర్మించి లబ్ధిదారులకు అందచేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.