. విద్యాశాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం
. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ల నియామకాలపై స్పష్టమైన ఆదేశాలున్నా అమలు చేయకపోవడంపై ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది. టీచర్ల పోస్టుల నియామకాలు చేపట్టడం లేదని విద్యాసంస్థల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ విషయమై కోర్టు బుధవారం విచారణ జరిపింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోగా నిర్వీర్యం చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. 2013 నుండి విద్యాశాఖలో పనిచేసిన అందరు అధికారులు ఇందుకు బాధ్యులేనని స్పష్టంచేసింది. ఎయిడెడ్ స్కూళ్లలో రేషనలైజేషన్పై ఇచ్చిన జీవోను అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులకు దీనికి ఏమైనా సంబంధం ఉందా అని హైకోర్టు ప్రశ్నిస్తూ… ఈ కేసు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. గతంలో కొందరు ఉన్నతాధికారులను కోర్టు ముందు హాజరు కావాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కొందరు అధికారులకు శిక్షలు కూడా విధించింది. అయితే ఉన్నతాధికారుల విన్నపం మేరకు కొన్ని శిక్షలను కోర్టు తగ్గించడమో, రద్దు చేయడమో చేసింది. ఇంత జరిగినా ఉన్నతాధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారు.