విశాలాంధ్ర- కర్నూల్ సిటీ : ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఐదేళ్లలో ఎటువంటి విద్యుత్ చార్జీలు పెంచనని స్పష్టంగా చెప్పారని, ఆ తర్వాత మాట తప్పి 4 ఏళ్లలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలను మోసం చేశారని సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు నరసింహ, ఎస్ యు సి ఐ నాయకులు నాగన్నలు ఘాటుగా విమర్శించారు. సర్దుబాటు పేరుతో పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ శుక్రవారం కర్నూల్ విద్యుత్ భవన్ ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు . ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి, సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడులు నాయకత్వం వహించారు. ఆందోళనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వామపక్ష నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కర్నూల్ ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ ఉమాపతికి అందజేశారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య మాట్లాడుతూ విద్యుత్ చార్జీలను ఒకేసారి కాకుండా ప్రజలను మభ్యపెట్టే విధంగా అప్పుడప్పుడు దశలవారీగా పెంచుతూ రూ 35వేల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై మోపారని దుయ్యబట్టారు. స్మార్ట్ మీటర్ల పేరుతో మరో 16 వేల కోట్ల రూపాయల భారాన్ని రైతాంగం, ప్రజలపై మోపడానికి సీఎం జగన్ రెడ్డి యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇంధనం, ట్రూ అప్, సర్దుబాటు చార్జీల పేరుతో వాడిన కరెంటు కన్నా అదనంగా రెండింతల చార్జీలను మోపి ప్రజల ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడం దారుణం అన్నారు. నగదు బదిలీ పేరుతో రైతులను మభ్యపెట్టి వారికి ఇస్తున్న ఉచిత విద్యుత్తును తొలగించే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. తక్షణమే స్మార్ట్ మీటర్లు, ఇంధనం, ట్రూ అప్ సర్దుబాటు పేరుతో ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. లేని పక్షంలో వైయస్ జగన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు.సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ వైయస్ జగన్ తన వ్యక్తిగత కేసులు,కొత్త అప్పులు, అదనపు నిధుల కోసమే ప్రధాని ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. ట్రూ అప్ సర్దుబాటు పేరుతో వసూలు చేస్తున్న అదనపు విద్యుత్ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే జగన్నాథం, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మునెప్ప, సిపిఎం సీనియర్ మహిళా నాయకురాలు నిర్మలమ్మ, సిపిఎం నాయకులు రాజశేఖర్,, సిపిఐ నాయకులు నాగరాజు, సి మహేష్ శ్రీనివాసరావు, బీసన్నలు పాల్గొన్నారు.