విశాలాంధ్ర- ధర్మవరం : ఖాతాదారులకు మరింత ఉత్తమమైన సేవలను అందిస్తామని ధర్మవరం ఎస్బిఐ మేనేజర్లు.. మెయిన్ బ్రాంచ్ సురేష్, మార్కెట్ బ్రాంచ్. సమీర్ హుస్సేన్, సిల్క్ బ్రాంచ్. సుధాకర్, టౌన్ బ్రాంచ్ సూర్య లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మొత్తం నాలుగు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు కార్యాలయంలో శనివారం 68వ ఎస్బిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం బ్యాంకు మేనేజర్లు మాట్లాడుతూ దేశ స్థాయిలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజల యొక్క మనన్నల ను పొందడంతో పాటు అన్ని బ్యాంకుల కన్నా ఎస్బిఐ విశేషమైన సేవలను అందిస్తుందని తెలిపారు. లాకర్లు, బంగారు నగలపై రుణాలు, రైతులకు, చిన్న, పెద్ద వ్యాపారస్తులకు వారి స్థాయిని బట్టి అతి తక్కువ సమయంలోనే రుణాలను ఇచ్చి వారి అభివృద్ధికి పాటుపడడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఖాతాదారుల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కటి ఆన్లైన్ ద్వారా క్షణాల్లో సేవలను అందించడం జరుగుతోందని అన్నారు. బ్యాంకు వద్ద, ఏటీఎంల వద్ద డబ్బు డ్రా చేసేటప్పుడు తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని వారు సూచించారు. ఖాతాదారుల యొక్క వివరాలను ఫోన్ ద్వారా బ్యాంకు ఎప్పుడు కూడా సమాచారాన్ని అడగదని, నేరుగా ఖాతాదారులతో మాత్రమే మాట్లాడడం జరుగుతుందని తెలిపారు. బ్యాంకు అందిస్తున్న వివిధ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని జీవితాన్ని సుఖవంతం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది రాఘవేంద్ర, నరసింహ రెడ్డి, యూనియన్ లీడర్ పుష్పలత, గోపాల్, నాలుగు బ్రాంచుల బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.