ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఉషశ్రీ , కలెక్టర్ ఎస్పీ
విశాలాంద్ర – కళ్యాణదుర్గం : మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేల ఈనెల 8న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గం రానున్నారు. రైతు దినోత్సవం సంబరాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ శనివారం వెల్లడించారు. కలెక్టర్ గౌతమి , ఎస్ పి శ్రీనివాసరావు, జెసి కేతన్ గార్గ్ , ఆర్డీవో నిశాంత్ రెడ్డిలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కరణం చిక్కప్ప ప్రభుత్వం ఉన్నత పాఠశాల ఆవరణంలో హెలిపాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. కంబదూరు బైపాస్ లోని కస్తూరిబా పాఠశాల సమీపంలో బహిరంగ సభ ఏర్పాట్లను చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు భద్రత ఏర్పాట్లు కూడా జిల్లా అధికారులు తో కలిసి మంత్రి సమీక్షించారు. అనంతపురం జిల్లాలో అన్నదాతలు పడుతున్న కష్టాలను తీర్చిన ప్రభుత్వం తమదేనని ఇటీవల కాలంలో పంట నష్టపోయిన రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గం వస్తున్నట్లు మంత్రి ఉషశ్రీ తెలిపారు. రూ. 210 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో జిల్లా రైతాంగానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు . ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా ప్రజలు, కళ్యాణదుర్గం నియోజకవర్గ రైతులు, మహిళలు , శ్రామికులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.