జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది. ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారని ఏలూరు సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మహిళా కమిషన్ ఈ నోటీసులు పంపింది. ఈ కామెంట్స్పై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఒంటరి మహిళల్ని అవమానపరిచేలా మాట్లాడారని.. ఆయన వివరణ ఇచ్చే వరకు మహిళా కమిషన్ వెంటాడుతుందన్నారు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. వాలంటీర్లకు పవన్ క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలన్నారు. అలాగే కేంద్ర ఇంటిలిజెన్స్ విడుదల చేసిందని చెబుతున్న నివేదికను బయటపెట్టాలన్నారు. పవన్ వ్యాఖ్యలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు పద్మ. ఈ మెయిల్స్ ద్వారా పవన్ పై మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారని.. వాలంటీర్స్పై పవన్ కళ్యాణ్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. పవన్ కు ఏ ఇంటిలిజెన్స్ అధికారి చెప్పారో సమాధానం చెప్పాలని.. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి తప్పించుకోలేరన్నారు. ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని అనుమానం కలుగుతోందని.. వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందన్నార. రాష్ట్రంలో 1400 మిస్సింగ్ కేసులు మాత్రమే ఉన్నాయని.. పవన్ కళ్యాణ్ చెప్తున్న 30వేల మిస్సింగ్ కేసులకు లెక్క చెప్పాలన్నారు. యువత చెడిపోవడానికి పవన్ కళ్యాణ్ సినిమాలే కారణమన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు, ఆందోళను నిర్వహిస్తున్నారు.. పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మమ్మల్ని బాధించాయని.. మహిళలమే ఎక్కువమంది వాలంటీర్లుగా పనిచేస్తున్నామంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ను కోరామని.. ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన వివరాలు మాత్రమే తీసుకుంటామన్నారు. లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు తీసుకోమని.. మహిళా వాలంటీర్లు అందరికీ పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలన్నారు.