పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు దాదాపు ఏకపక్షంగానే ఉన్నాయి. 2024లో లోకసభకు ఎన్నికలు జరగడానికి ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ సాధించిన అసాధారణ విజయం ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య హింసాయుత ఘర్షణలు జరిగి చాలామంది హతులవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాలుగా నిలుస్తుంది. ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి ప్రధాన పార్టీలు ఇటీవల కాలంలో సహకరించడంలేదు. ఈ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు గెలవడానికి బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ విఫలమైంది. ఈసారి సీపీఎం, కాంగ్రెస్, ఇస్లామిక్ ఫ్రంట్ ఒక కూటమిగా కలిసిపోటీచేసి కొన్ని చోట్ల తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలను వెనక్కునెట్టాయి. అక్కడకూడా ఈ పార్టీలు విజయం పొందాయి. ముఖ్యంగా ముషీరాబాద్, మాల్టా ప్రాంతాల్లో వామపక్షం, కాంగ్రెస్లు కొన్ని సీట్లు గెలుచుకున్నాయి. ఈ ఫలితాలు వామపక్షం, కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాయి. ఈ రెండు ప్రాంతాల్లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని తృణమూల్ కాంగ్రెస్ తిరిగి సాధించలేకపోయింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో బీజేపీకి నిరాశ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లోనై ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు విస్తృతంగా పర్యటించి తమ పార్టీ అఖండ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. డాంబికాలు పలికి తీవ్ర అపజయాన్ని చవిచూసింది. రానున్న లోకసభ ఎన్నికల్లోనూ పశ్చిమ బెంగాల్లో బీజేపీ పెద్దగా ఆశ పెట్టుకోవడానికి అవకాశమేలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు సంకేతాలనిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ను చీల్చి బీజేపీని బలోపేతం చేయాలన్న లక్ష్యం ఇప్పట్లో నెరవేరదు. లోకసభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఫ్రంట్ పోటీ చేయడానికి నిర్ణయానికి వచ్చాయి. తాజాగా మరికొన్ని ప్రతిపక్షాలు ఈ ఫ్రంట్లో చేరడంతో ఫ్రంట్ మరింత బలోపేతమైంది.ఈ నెల 17,18 తేదీలలో బెంగళూరులో జరగనున్న ప్రతిపక్ష సమావేశంలో మొత్తం 23పార్టీలు పాల్గొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నాయి. ఫ్రంట్ పేరును, సీట్ల సర్దుబాటును చర్చించి నిర్ణయించే అవకాశంఉంది. పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర అక్రమాలు జరిగినందున వాటిని రద్దుచేసి తిరిగి ఎన్నికలు జరపాలని, ఎన్నికల కమిషనర్ను తప్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. బీజేపీ తరఫునే పిటిషన్లు వేశారనే విషయం తిరస్కరించలేనిది. బీజేపీ ఎన్నిఎత్తులు వేసినా దాని ప్రయత్నాలు ఫలించే పరిస్థితులు లేవు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయని రాష్ట్ర గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపినా పెద్దగా ఫలితం ఉండదు. సార్వత్రిక ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్నందున ఇప్పుడు బెంగాల్లో ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధిస్తే అది బీజేపీకే ఎదురుదెబ్బ అవుతుంది. దేశవ్యాప్తంగా బీజేపీ నరేంద్ర మోదీపైన వ్యతిరేకత ప్రబలంగా ఉందన్న విశ్లేషణల నేపధ్యంలో ఆ పార్టీపై వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలన్నీ కలిసి మోదీ పాలనలో చోటు చేసుకున్న వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను దేశమంతటా ప్రచారం చేస్తాయి. ఈ చర్య తీసుకుంటే ఇప్పటికే ఈసారి లోకసభ ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యం కాదన్న ఆలోచనలో మోదీ`షా ద్వయాలను మరింత ఆందోళనకు గురిచేస్తుంది.
పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన తృణమూల్ కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి మమతబెనర్జీ లోకసభకు జరిగే ఎన్నికల్లో బీజేపీని ఓడిరచాలన్న లక్ష్యం నెరవేర్చేందుకు అత్యంత సర్దుబాటు వైఖరిని చూపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిపక్షాల ఐక్యత కోసం మొదట మమత ప్రయత్నించి ఆ తర్వాత ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రకటించారు. గతంలో ఆమె దిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కలిసి చర్చించారు కూడా. ఇది జరిగిన కొద్దికాలానికే వైఖరి మార్చుకున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ఖడ్గే ఎన్నికైన తర్వాత, మళ్లీ ప్రతిపక్ష ఐక్యతకు గట్టిగా నిలిచి, పట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశాన్ని నిర్వహించడానికి క్రియాశీలంగా తన పాత్ర నిర్వహించారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయం నేపధ్యంలో ప్రతిపక్షాలకు భంగం కలగకుండా నడుచుకోవలసిన బాధ్యత ఉందని మరువరాదు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 79శాతం ఓట్లు తృణమూల్ కాంగ్రెస్కు లభించాయి.
పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం ప్రజాభిప్రాయం అత్యధికంగా తృణమూల్ కాంగ్రెస్కు అనుకూలంగా ఉంది. అసెంబ్లీ, లోకసభకు జరిగే ఎన్నికలకు, పంచాయతీ ఎన్నికల ఓటర్ల అభిప్రాయాలు మారవచ్చు. కానీ, పాలకపార్టీ ఓటమిచెందే పరిస్థితులు రాష్ట్రంలో లేవు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి రప్పించుకున్న సుభేందు అధికారి పార్టీని బలోపేతం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో మమత వ్యక్తిగత పలుకుబడి, ప్రభావం ఓటర్లపై ఉందని భావించవచ్చు. దక్షిణ 24పరగణా జిల్లాలోని భంగ్నగర్ ప్రాంతంలో ఎక్కువగా ముస్లింలున్నారు. వామపక్షం, కాంగ్రెస్, ఇస్లామిక్ ఫ్రంట్ కలిసి ఏర్పడిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఈ ప్రాంతంలోని మొత్తం 132 సీట్లలో 43 సీట్లు గెలుచుకుని గణనీయమైన విజయం సాధించింది. ఈ ప్రాంతంలో గతంలో మంచి పట్టున్న మమతబెనర్జీ ప్రభావం తగ్గిందని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ సాగర్దిఘి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపొందిన తర్వాత ముస్లింలు తృణమూల్ కాంగ్రెస్కి దూరమవుతున్న ధోరణి కనిపించింది. పంచాయతీ ఎన్నికలు కూడా ఈ విషయాన్నే స్పష్టం చేశాయి. అందువల్ల గెలిచిన పార్టీ విజయాన్ని ఆనందించవచ్చుగానీ విర్రవీగడం సరైందికాదు. ఈ విషయంలో బీజేపీ ఇతర పార్టీలకంటే ముందుంటుంది. మితిమీరిన అహంభావం ప్రదర్శిస్తూ సామాన్య ప్రజలను పట్టించు కోకుండా, కార్పొరేట్లను మరింత సంపన్నులను చేస్తున్న మోదీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పకపోరు.