. నేడు మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ
. అజిత్ వర్గానికే కీలక శాఖలు!
. అధికార కూటమిలో మల్లగుల్లాలు
. షిండే వర్గానికి మొండిచేయి: శివసేన(యూబీటీ)
ముంబై : మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ శుక్రవారం జరగనున్నట్లు అధికార శివసేన గురువారం వెల్లడిరచింది. కీలక శాఖల కేటాయింపు అదే రోజు ఉంటుందని తెలిపింది. అయితే కొత్త మంత్రివర్గంలో అసలు షిండే వర్గానికి స్థానం దక్కుతుందా అన్న అనుమానాలు ప్రతిపక్షంలోని వారు వ్యక్తంచేస్తున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులుగా మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈనెల 2న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఆకస్మిక పరిణామం శరద్ పవార్ పార్టీని చీల్చేసింది. అయితే ఎన్సీపీ నేతలు పాలకపక్షంలో చేరడం శివసేన`బీజేపీ సంకీర్ణంలో అసమ్మతి జ్వాలను రగిల్చింది. మంత్రిత్వశాఖల కేటాయింపుపై గొడవ మొదలైంది. దీంతో మంత్రివర్గ విస్తరణకు ప్రాధాన్యత ఏర్పడిరది. అజిత్ పవార్ నేతృత్వ ఎన్సీపీని అణగిమణగి ఉంచాలనుకున్న ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ వర్గాలకు షాకిచ్చేలా కీలక శాఖలను అజిత్ వర్గం ఎగరేసుకుపోనున్నట్లు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద ఉన్న ఆర్థిక శాఖను అజిత్ పవార్కు అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తమ పార్టీ మంత్రులకు కీలక శాఖలను అజిత్ డిమాండ్ చేస్తున్నారని, ఆర్థిక, ప్రణాళిక, సహకార శాఖల కోసం పట్టుబడుతున్నట్లు తెలిసింది. శాఖల కేటాయింపుపై ఈనెల 10,11 తేదీల్లో షిండే, ఫడ్నవీస్, అజిత్ చర్చలు జరుపగా శాఖల కేటాయింపు సమస్య పరిష్కారమైనట్లు ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ బుధవారం తెలిపారు. మరో ఒకటి లేక రెండు శాఖలపై నిర్ణయం జరగాల్సి ఉందన్నారు. మంత్రిత్వశాఖల కేటాయింపు విషయంలో అధికార కూటమిలో వివాదాలు ఏమీ లేవని తెలిపారు. ఇదిలావుంటే, కేబినెట్లో అసలు షిండే వర్గానికి స్థానం దక్కుతుందా అన్న సందేహాన్ని శివసేన (యూబీటీ) వ్యక్తంచేసింది. ఆ వర్గంలోని ఆశావహులకు నిరాస తప్పబోదని వ్యాఖ్యానించింది. అధికార కూటమిలోకి చేర్చుకున్న కొత్త వారిని సంతృప్తిపర్చడం బీజేపీకి కష్టసాధ్యమని శివసేన (యూబీటీ) నేత, మహారాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నేత అంబదాస్ దాన్వే అన్నారు. మూడు పార్టీల నుంచి మంత్రులు కావాలనుకునే ఎమ్మెల్యేల సంఖ్యకు… ఉన్న పదవుల సంఖ్యకు మధ్య సమతుల్యత లేదని చెప్పారు. ఈ విషయంలో బీజేపీ నేతల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉందని దాన్వే తెలిపారు. ఈపరిస్థితుల్లో కేబినెట్ విస్తరణ సవాళ్ల భరితమేనన్నారు. పాలక పక్షంలోని వారికి ఆగ్రహం తెప్పించే అవకాశాలు ఉన్నందున కేబినెట్ విస్తరణ జరగకపోవచ్చన్న అనుమానాన్ని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ వ్యక్తంచేశారు. అజిత్ పవార్ వర్గంలోని మంత్రులంతా గతంలో ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా పనిచేసిన వారని, అదే స్థాయి పదవిని వారు ఇప్పుడూ కోరుకుంటారని, వారిని సంతృప్తిపర్చడం బీజేపీకి కష్టమని రౌత్ తెలిపారు.