కేంద్రప్రభుత్వ అధీనంలోఉన్న వ్యవస్థలను వినియోగించుకుని రాజకీయ ప్రత్యర్థులను వేధించాలనుకుంటే తమ చెప్పుచేతల్లో ఉండే అధికారులు కూడా కావాలి. గత అయిదేళ్ల నుంచి ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టొరేట్ లో డైరెక్టర్గా ఉన్న సంజయ్ కుమార్ మిశ్రా మోదీ ప్రభుత్వం చెప్పినట్టల్లా చేశారు. అందుకే ఆయన పదవీ కాలాన్ని మరోసారి పొడిగించి ఈ ఏడాది నవంబర్ దాకా కొన సాగించాలని తలిస్తే సుప్రీంకోర్టు అలాంటి ఆదేశాలు చెల్లవని మంగళవారం ఆదేశించి ప్రభుత్వ ఆలోచన మీద నీళ్లు చల్లింది. సంజయ్ కుమార్ మిశ్రాను కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం వినిపించిన వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పదవిలో ఎవరూ ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పలేదు. కానీ మిశ్రానే కొనసాగించవలసిన అవసరం ఏమిటి అని నిలదీసింది. ఈ పదవికి అర్హులైన వారు మరెవరూ లేరా అని ప్రశ్నించింది. మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించడం చట్ట విరుద్ధం అని సుప్రీంకోర్టు స్పష్టంగాచెప్పింది. ఆయనను ఈ నెలాఖరులోగా రాజీనామా చేయాలని ఆదేశించింది. అయితే కేంద్ర నిఘాకమిషన్ అధికారాలను పెంచడాన్ని మాత్రం సుప్రీంకోర్టు తప్పు పట్టలేదు. ఒక అధికారి సమర్థుడు అని అనుకున్నప్పుడు, ఆయన ప్రారంభించిన మంచిపని కొనసాగడానికి ఆ వ్యక్తే పదవిలో ఉండడం మేలని ప్రభుత్వం భావించినప్పుడు ఒక సంవత్సరం పొడిగించడం ఆనవాయితీ. అవసరం అనుకుంటే మరో సంవత్సరం పొడిగించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఈ సంప్రదాయాలను జవదాటి మోదీ ప్రభుత్వం సంజయ్ మిశ్రా పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించడం విచిత్రంగా ఉంది. రాజకీయ ప్రత్యర్థులను వేధించాలనుకునే ప్రభుత్వానికి తాము చెప్పినట్టు వినే అధికారులే ఉండాలి. మిశ్రా విషయంలో ఇదే జరిగింది. కానీ సుప్రీంకోర్టు అడ్డుకుని చట్టబద్ధంగా వ్యవహరించక తప్పని పరిస్థితి కల్పించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ డైరెక్టర్ పదవీ కాలాన్ని పొడిగించడాన్ని సవాలు చేసిన పిటిషన్లలో పసలేదని అందువల్ల ఈ పిటిషన్లను తోసి పుచ్చాలని కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఈ పొడిగింపును సవాలు చేసిన వారికి స్వార్థ ప్రయోజనాలున్నాయని, ఇందులో ప్రజా ప్రయోజనం ఏమీలేదని కూడా వాదించి ప్రభుత్వం ఈ అంశానికి రాజకీయ రంగు పులిమింది. ఈ వితండవాదాన్ని సుప్రీంకోర్టు ఖాతరు చేయకపోవడం గమనించవలసిన అంశం. అధికార పార్టీకి ప్రత్యర్థులైన వారిని వేధించే అధికారులకు ఇష్టానుసారంగా పొడిగింపులు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టడంలో అనౌచిత్యం ఏమీ లేదు. రాజకీయ నాయకులను, పౌరసమాజానికి చెందిన వారిని వేధించడానికి సంజయ్ మిశ్రాను మోదీ సర్కారు వాటంగా వినియోగించుకుంది. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం అన్న పిటిషనర్ల వాదనను పరిశీలించిన సుప్రీంకోర్టు తన పరిభాషలో చట్టవిరుద్ధం అని తేల్చింది.
తమ అధీనంలో ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి వేధింపులకు పాల్పడడం బీజేపీ నాయకులు పన్నిన పక్కా వ్యూహం. మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించడం చెల్లదని సుప్రీంకోర్టు చెప్పినందుకు అమితా నందపడిపోతున్న వారు భ్రమలో ఉన్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఆమోదించిన కేంద్ర నిఘా కమిషనర్ చట్టాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించిందని షా గుర్తు చేశారు. దీన్ని షా తనకు అనుకూలంగా మలుచుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ అవినీతిపరుల మీద దాడులు కొనసాగిస్తుందని తేల్చి చెప్పారు. ఎవరు డైరెక్టర్గా ఉన్నారన్నది ప్రధానం కాదని అమిత్ షా అన్నారు. ఆ పదవిలో ఎవరున్నా అవినీతిపరులైన ఆనువంశిక పాలనకోసం పరితపించే వారిపైన కొరడా రaళిపిస్తూనే ఉంటుందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రత్యేకంగా గమనించాలి. అవినీతిని కట్టడి చేయడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్తో సహా ఇతర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నదే ముఖ్యమైన అంశం. దీన్ని కట్టడి చేయడానికి సుప్రీంకోర్టు తీర్పు ఏ రకంగానూ ఉపకరించదు. అనువంశిక పాలనకు, అవినీతికి, దానిని కట్టడి చేస్తుందంటున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ కు సంబంధం ఏమిటో మాత్రం అమిత్ షా వివరించలేదు. సుప్రీంకోర్టు తీర్పును కూడా రాజకీయ ప్రయోజనాలకు వినియోగించే ఆత్రుత మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా ఆనువంశిక పాలకులు అభివృద్ధికి వ్యతిరేకులని కూడా కేంద్ర హోం మంత్రి వక్రభాష్యం చెప్తున్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యను సుప్రీంకోర్టు తోసిపుచ్చిందన్న వాస్తవాన్ని కప్పి పుచ్చడానికి అమిత్ షా ఇలాంటి కువ్యాఖ్యానాలకు పాల్పడుతున్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిందని షా ఎలాగూ అంగీకరించరు. సుప్రీంకోర్టు సంజయ్ మిశ్రా పదవీ కాలాన్ని చట్ట వ్యతిరేకంగా పొడిగిస్తూ పోవడాన్ని తప్పు పట్టడం అమిత్ షా లాంటి వారికి అంతరాంతరాల్లో ఆగ్రహం కలిగించక తప్పదు. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోకి వస్తుంది. కానీ ఆ శాఖ మంత్రి ప్రస్తావించకుండా హోం మంత్రి భాష్యాలు చెప్తుంటారు. ఈ తీర్పు ప్రకంపనలు ఏ మేరకు వ్యాపించాయో తెలుసుకోవడానికి అమిత్ షా వ్యాఖ్యల్ని గమనించాలి. అయితే తీర్పులో అత్యున్నత న్యాయస్థానం ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. తీర్పులోని న్యాయపరమైన అంశాలు ఎంత ముఖ్యమైనవో దాని పర్యవసానాలు కూడా అంతే ప్రధానమైనవి.
సుప్రీంకోర్టు తీర్పువల్ల తమ అధీనంలోని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి రాజకీయ ప్రత్యర్థుల మీద కసితీర్చుకునే మోదీ ప్రభుత్వం ధోరణి మారదు అని అమిత్ షా వ్యాఖ్యలవల్ల తేలిపోతోంది. మోదీ ప్రభుత్వ బాధల్లా కొత్తగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అయ్యే వ్యక్తి సంజయ్ మిశ్రా లాగా తమకు అనుకూలంగా వ్యవహరిస్తారో లేదో అన్న భయం కూడా ప్రభుత్వాన్ని పీడిస్తోంది. కొత్తగా బాధ్యతలు చేెపట్టబోయే అధికారి సుప్రీంకోర్టు తీర్పు అంతస్సారాన్ని, మోదీ వ్యతిరేకంగా వీస్తున్న గాలిని గమనించకుండా ఉండేంత అమాయకుడిగా మెలగక పోవచ్చు. అదీ మోదీ షా అక్కసు. సుప్రీం కోర్టు తీర్పు మిశ్రా పదవీకాలాన్ని పొడిగించడం చట్టవ్యతిరేకం అని చెప్పిందే తప్ప అలాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడ్డ కేంద్ర ప్రభుత్వం మీద ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. బిహార్ దాణా కుంభకోణం కేసులో పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్.బి.సిన్హా పదవీ కాలాన్ని పొడిగించడాన్ని పట్నా హైకోర్టు తప్పు పట్టడమే కాక ఈ విషయంలో లాలూ ప్రసాద్ యాదవ్కు శిక్ష కూడా విధించింది. ప్రభుత్వ అక్రమ చర్యలను కట్టడి చేయడానికి సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదు. కనక చట్ట వ్యతిరేకంగా పనిచేయడానికి అలవాటు పడ్డ మోదీ సర్కారు అదే దుర్నీతిని అనుసరించకుండా ఉండదుగదా!