. పెరుగుతున్న గోదావరి, శబరి నీటి మట్టాలు
. ముంపు మండలాల నుంచి ప్రజల తరలింపు
విశాలాంధ్ర బ్యూరో-పాడేరు : భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి, శబరి నదుల నీటిమట్టాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తోంది. గురువారం సాయంత్రానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చ రికను జారీ చేశారు. గురువారం ఉదయం 8.00 గంటలకు 39.5 అడుగులున్న గోదావరి… క్రమ క్రమంగా పెరుగుతూ సాయంత్రం 6.00 గంటలకు 43.30 అడుగులకు చేరుకుంది. మరోవైపు చత్తీస్గఢ్లో కూడా భారీ వర్షాలకి శబరి ప్రవాహం కూడా అమాంతం పెరిగింది. దీంతో విలీన మండలాలైన దేవీపట్నం, చింతూరు, ఎటపాక, వీఆర్ పురం, కూనవరం మండలాల్లో అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో ఆయా మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితిని గమనించిన జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసింది. కొన్ని గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు, సుర క్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వరద సహాయక సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉంటూ వరద పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. వరద మరింత పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతా లకు తరలించేందుకు లాంచీలు, మర పడవలను సిద్ధంగా ఉంచారు. గ్రామాల్లోకి వరద ప్రవేసిస్తే ఇళ్లను ఖాళీచేయించి వాటిద్వారా ప్రజలను పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. అత్యవసర వైద్యసేవలు అవసరమైన వారిని తరలించేందుకు కూడా లాంచీలు, పడవలను వినియోగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన గర్భిణులు, డయాలసిస్ రోగులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాల్లోని ఆసుపత్రికి తరలించారు.
నీట మునిగిన పోచమ్మ ఆలయం
అల్లూరి జిల్లా దేవీపట్నం దేవీ పట్నం మండలం పోచమ్మ గండి ఆలయాన్ని గోదావరి ముం చెత్తింది. అమ్మవారి ఆలయ గోపురం వరకు వరదనీరు చేరింది. దండంగి పురుషోత్తపట్నం అర్అండ్ బీ రహదారి పైకి వరదనీరు చేరడంతో పోచమ్మగండికి రాక పోకలు పూర్తిగా స్తంభించాయి. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ కారణంగా పోచమ్మగండి వద్ద వరద ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. అమ్మవారి ఆలయానికి భక్తులెవరూ రావొద్దని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. గోదావరి పోటు కారణంగా దండంగి నాగుకు సీతారం వరకూ వరదనీరు పోటెత్తింది.
కూనవరం మండలంలో
కూనవరం మండలంలో శబరి, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో లోతట్టు కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేసేం దుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్థానిక గిన్నెలబజారు, ఉదయ భాస్కర్ కాలనీ ప్రజలను ఏపీ ఆర్ గురుకుల పాఠశాలకు తరలి వెళ్లాల్సిందిగా కూనవరం ఎస్సై వెంకటేష్, తహసిల్దార్ అనసూర్య అప్రమత్తం చేశారు. శబరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మండల కేంద్రం నుంచి శబరి కొత్తగూడెం, కొండరాజుపేట, పూసుగూడెం, జిల్లెల్లగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.