. ఎన్నికల వేళ జగన్కు తలనొప్పి
. రామచంద్రాపురంపై రచ్చ
. ఎంపీ బోస్ వర్సెస్ మంత్రి వేణు
. గన్నవరం గరం గరం
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ వైసీపీలో ముఠా తగాదాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. జిల్లాలు, నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం నాయకులు తహతహలాడుతున్నారు. బలప్రదర్శనను నిరూపించుకోవడం ద్వారా టికెట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని నియోజకర్గాలు, జిల్లాల్లో అధిష్ఠానం మాట వినేపరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇదంతా ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్కు పెద్ద తలనొప్పిగా మారింది. అనంతపురము జిల్లా హిందూపురం నియోజకవర్గ వైసీపీ నేతల మధ్య వైరుధ్యాలను సీఎం జగన్ ఇటీవలే పరిష్కరించారు. అక్కడ అంతా చక్కబడిరదనేలోగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ వైసీపీ నేతల ఆధిపత్య పోరు జగన్కు పెద్ద తలనొప్పిగా మారింది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ఈ పంచాయతీ వెళ్లినా సద్దుమణగలేదు. ఎంతకైనా తెగిచేందుకు రెండు వర్గాలు సిద్ధమయ్యాయి. సీఎం సర్దిచెప్పాక కూడా ఆత్మీయ సమావేశాల పేరిట బలప్రదర్శనలు చేయడం వైసీపీ అధిష్ఠానానికి ఇబ్బందిగా మారింది. రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు అంతిమ దశకు చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అదే నియోజకవర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య టికెట్ వార్ నడుస్తోంది. 2024లో వేణుగోపాలకృష్ణకు టికెట్ ఇస్తే తాను అంగీకరించబోనని, అవసరమైతే పార్టీ వీడతానని పిల్లి సుభాశ్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ అధిష్ఠానం అప్రమత్తమైంది. పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి జగన్తో ఎంపీ కలిసి నడిచారు. అప్పట్లో మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ చెంతకు చేరారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ బోస్కు తన కేబినెట్లో మంత్రి పదవి ఇచ్చి జగన్ గౌరవించారు. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అనంతరం రాజధాని అంశంపై శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ తీర్మానించడంతో బోస్ ఎమ్మెల్సీ పదవి రద్దవుతుందనే ఉద్దేశంతో ఆయనను తిరిగి రాజ్యసభకు జగన్ పంపారు. ఇంత చేసినా బోస్ అధిష్ఠానంపై తిరుగుబాటు చేయడం జగన్కు, పార్టీ సీనియర్లకు మింగుడు పడటం లేదు. అటు వేణుగోపాలకృష్ణ సైతం 2014లో కాకినాడ రూరల్ నుంచి వైసీపీ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2019లో కాకినాడ రూరల్ టికెట్ను కురసాల కన్నబాబుకు కేటాయించిన వైసీపీ…వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురానికి పంపింది. అక్కడ ఆయన గెలవడంతో రెండో విడత మంత్రి పదవి లభించింది. తనను జగన్ రామచంద్రాపురానికి పంపారని, జగన్ మాట ఇస్తే తప్పబోరని మంత్రి వేణు నొక్కిచెబుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో రామచంద్రాపురం టికెట్ తనదేననే సంకేతాలను తన అనుచరుల ద్వారా చెప్పిస్తున్నారు.
తనయుడికి సీటు కోసం బోస్ యత్నం
వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి తన తనయుడిని రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వేణుగోపాలకృష్ణ అనుచరులు నియోజకవర్గంలో తమ కార్యకలాపాలను వేగవంతం చేశారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేణుగోపాలకృష్ణకు, బోస్కు మధ్య ఆధిపత్య పోరు ఉధృతమైంది. వేణు బరిలో ఉంటే మద్దతిచ్చేది లేదంటూ తమ కేడర్ చెబుతున్నారని బోస్ బహిరంగంగా చెప్పారు. తమ కుటుంబం నుంచే ఎవరో ఒకరు పోటీ చేయాలని కోరుతున్నారన్నారు. తనకు కేడరే ముఖ్యమని, రాజ్యసభకు రాజీనామా చేస్తానని, అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని వ్యాఖ్యానించారు. రెండు వర్గాలు రామచంద్రాపురం కేంద్రంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ, తమ బలాబలాల్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి వేణు ఆత్మీయ సమావేశానికి పిల్లి సుభాష్ చంద్రబోస్కు ఆహ్వానం పంపకపోడంపై ఆయన అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను బోస్ కలిసినా ప్రయోజనం కనిపించడం లేదు. తమ కేడర్పై మంత్రి వేణుగోపాలకృష్ణ ఇష్టానుసారం కేసులు పెడుతున్నారని సీఎం జగన్ దృష్టికి బోస్ తీసుకొచ్చారు. తమ కుటుంబానికే టికెట్ ఇవ్వాలని బోస్ అడుగుతున్నారు.
తాజాగా రామచంద్రాపురం వ్యవహారంపై సీఎంవోకు వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వచ్చారు. మంత్రి వేణుపై తోట ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో పరిస్థితులు బాగోలేదన్నారు. దీంతో తోట త్రిమూర్తులతో ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ మిథున్రెడ్డి, సీఎంవో కార్యదర్శి ధనుంజయ్రెడ్డి గంటసేపు భేటీ అయ్యారు. రామచంద్రాపురంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. మూడు, నాలుగు రోజుల్లో సీఎంతో వైసీపీ నేతలు భేటీ కానున్నారు.
గన్నవరంలోనూ టికెట్ కుంపటి
తాజాగా గన్నవరం నియోజకవర్గ టికెట్ వ్యవహారం తెరపైకి వచ్చింది. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అక్కడ వైసీపీకి మద్దతుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వంశీపై స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన యార్లగడ్డ వెంకట్రావ్…వంశీ పాత్రపై మండిపడుతున్నారు. గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లో వైసీపీ సీనియర్ నేత రామచంద్రరావుతో యార్లగడ్డ భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేస్తానని, గన్నవరం రాజకీయాల్లోనే కొనసాగుతానని యార్లగడ్డ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. టికెట్ల కోసం బలప్రదర్శనలతో నేతలు నిమగ్నమవడం వైసీపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.