హైదరాబాద్లో పెను ప్రమాదం తప్పింది. మలక్పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే ట్రాక్పైకి వచ్చాయి. అయితే రెండు రైళ్లలోని లోక్ పైలట్లు ముందే గమనించి ట్రైన్లను నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. రెండు రైళ్లు ఒకే ట్రాక్పైకి రావడంతో ప్రయాణికులు కాసేపు టెన్షన్ పడ్డారు. లోక్ పైలట్లు అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడం, ట్రైన్లను నిలిపివేయడంతో ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు. అదే రెండు రైళ్లు ఢీకొని ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక రైలును మరో ట్రాక్పైకి మళ్లించారు. దీంతో రెండు రైళ్లు వేరే వేరే ట్రాక్ల పైనుంచి పెళ్లాయి. ఈ ఘటనతో రెండు ఎంఎంటీఎస్ ట్రైన్లు అరగంటపాటు ఆగిపోయాయి. అయితే ఈ ఘటనపై సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు విచారణ చేపడుతున్నారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్పైకి ఎలా వచ్చాయనేది ఆరా తీస్తున్నారు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగానే ఇలా జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో లోపం ఎక్కడ జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో మంటలు చెరలేగిన ఘటన కలకలం రేపింది. ఈ అగ్నిప్రమాదంలో ఏకంగా ఏడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పశ్చిమబెంగాల్ నుంచి సికింద్రాబాద్ వస్తుండగా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు మంటలను గుర్తించి ట్రైన్ నుంచి కిందకు దిగేయడంతో ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ విద్రోహ చర్య ఏమీ లేదని, ట్రైన్లో షార్ట్ షర్క్యూట్ జరగడం వల్లనే అగ్నిప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు నిర్దారించారు.