. ఏపీ ఈఏపీ సెట్ ద్వారా 35 శాతం సీట్ల భర్తీ
. రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపు
. చట్టంలో మార్పుచేసిన ప్రభుత్వం
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేసిన 35శాతం కన్వీనర్ కోటా సీట్లకు డిమాండ్ ఏర్పడిరది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఏపీ ఈఏపీసెట్ కన్వీనర్ కోటా కింద 35శాతం సీట్లను భర్తీ చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ ప్రైవేట్ స్టేట్ యూనివర్సిటీస్ చట్టం-2006లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తెచ్చింది. ఈ విధానంలో రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఆయా విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుత కౌన్సెలింగ్లోనూ 35 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. ఆ విధంగా సీట్లు పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత ఉంటే… జగనన్న విద్యా దీవెన (జేవీడీ) ద్వారా ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది. జేవీడీకి అర్హత లేని విద్యార్థులంతా కన్వీనర్ కోటా కింద నిర్ణయించే ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. 2022 కౌన్సెలింగ్లో ఆయా విశ్వవిద్యాలయాలకు అనుగుణంగా కన్వీనర్ కోటా కింద ఫీజు దాదాపు రూ.50వేల నుంచి రూ.75వేల వరకు ప్రభుత్వం నిర్ణయించింది.
కన్వీనర్ సీట్లపైనే ఆసక్తి
భారీ ఫీజులు భరించలేని పేద విద్యార్థులంతా ముందస్తుగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలోని కన్వీనర్ సీట్లనే ఎంచుకుంటున్నారు. గతేడాది ఏపీ ఈఏపీసెట్ 2022 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆధారంగా అన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కలిపి దాదాపు 3వేలకుపైగా సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది సీట్లు పెరిగే అవకాశాలున్నాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్, ఇసీఈ, ఈఈఈ, సివిల్, మెకానికల్ బ్రాంచ్లు ఉన్నాయి. అయితే బ్రాంచ్లతో సంబంధం లేకుండా ప్రైవేట్ యూనివర్సిటీ సీట్లపై దృష్టి పెడుతున్నారు. గతేడాది ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకే ఎక్కువ మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చేందుకు మొగ్గు చూపారు. ఆ తర్వాత ఆంధ్రా, జేఎన్టీయూ విశ్వవిద్యాలయాలు, కళాశాలలపై ఆప్షన్లు ఇవ్వడం గమనార్హం.
యాజమాన్య కోటా సీట్లు అందని ద్రాక్షేనా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం చెన్నై, ఒడిశా, కర్నాటకలో పేరొందిన ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తమ కార్యకలాపాల్ని రాష్ట్రంలోనూ ప్రారంభించాయి. భారతీయ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్(అనంతపురం), సెంచూరియన్ (విశాఖపట్నం), అమరావతిలోని ఎస్ఆర్ఎం, వీఐటీ ఏపీ, మోహన్బాబు (తిరుపతి) తదితర విశ్వవిద్యాలయాలున్నాయి. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తాయి. అందులో ఎలాంటి రిజర్వేషన్లు, ఫీజు రాయితీలు ఉండవు. పేరుకే ప్రవేశ పరీక్షలు అయినప్పటికీ, ఫీజులన్నీ దాదాపు అందరికీ సమానంగానే ఉంటాయి. ప్రవేశ పరీక్షలో అత్యధికంగా మార్కులు సాధించిన వారికి రూ.10వేల నుంచి 25వేల వరకు రాయితీ కల్పిస్తారు.
ఈ విశ్వవిద్యాలయాల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు అధికంగా ఉంటాయనే ప్రచారాన్ని తీసుకొచ్చి, విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎరవేస్తున్నారు. దీంతో ఐఐటీ, ఎన్ఐటీలో సీట్లు సాధించలేని విద్యార్థులంతా ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో యాజమాన్య కోటా కింద బీటెక్ కోర్సులు చదివేందుకు ఎగబడుతున్నారు. వాటిల్లో చదవాలంటే ఏడాదికి రూ.3లక్షలకుపైగా కేవలం ఫీజుకే అవుతుంది. దూర ప్రాంతాల విద్యార్థులు హాస్టల్లో ఉంటే అదనంగా మరో రూ.లక్షా 50వేలు అవుతుంది. ఇతరత్రా ఖర్చులు కలుపుకుని మొత్తంగా ఏటా రూ.5లక్షల వరకు ఖర్చు అవుతుంది. అలాంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్ కోటా కింద సీట్లను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇంజినీరింగ్ ధ్రువీకరణ పత్రాల నమోదు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మశీ (ఏపీ ఈఏపీసెట్) 2023 ప్రవేశాల వెబ్ కౌన్సెలింగ్లో భాగంగా ఇంజినీరింగ్ విభాగం అభ్యర్థులకు ఈనెల 25 నుంచి ధ్రువీకరణ పత్రాల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 4 వరకు అభ్యర్థులు వెబ్సైట్లోకి వెళ్లి స్వయంగా తమ అసలు ధ్రువీకరణ పత్రాలను స్కాన్ చేసి పొందు పరచాలి. అలాంటి సమయంలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే, సమీప సహాయ కేంద్రానికి వెళ్లి సరిచూసుకోవాలి. ఈనెల 24వ తేదీ నుంచి ఆగస్టు 3 వరకు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు ఫీజు చెల్లించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి.ఆగస్టు 3వ తేదీ నుంచి 8వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత 12న సీట్లను ఖరారు చేస్తారు. ఆయా అభ్యర్థులు తమ వివరాలతో సీట్లు పొందిన కళాశాలలకు 13, 14 తేదీల్లో వెళ్లి అందజేయాలి. ఆగస్టు 16వ తేదీ నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభమవుతాయి.