డమాస్కస్: రాజధాని డమాస్కస్కు దక్షిణంగా ఉన్న షియా ముస్లింలకు చెందిన ప్రార్థనా మందిరం సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడు ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అధికారులు స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అయితే, గాయపడిన వారిలో అనేకమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. సిరియాలో అత్యధికంగా సందర్శించే షియా పుణ్యక్షేత్రమైన సయేదా జైనాబ్ సమాధి సమీపంలో అషురాకు ఒకరోజు ముందు ఈ బాంబు పేలుడు సంభవించింది. ఇది ఉగ్రవాదుల బాంబు దాడి అని సిరియా అధికారులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు కారులో బాంబు పెట్టడం వల్ల పేలుడు సంభవించిందని స్టేట్ టెలివిజన్ నివేదించింది. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం రావడంతో సమీపంలోని ప్రజలు పరుగులు తీశారు. పేలుడు జరిగిన వెంటనే ఘటనా స్థలికి అంబులెన్సులు చేరుకోవడంతో భద్రతా దళాలు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. మహమ్మద్ ప్రవక్త మనవరాలు, ఇమామ్ అలీ కుమార్తె అయిన సయీదా జీనాబ్ సమాధి నుండి 600 మీటర్ల దూరంలో ఉన్న భద్రతా భవనం సమీపంలో ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. బాంబు పేలుడు దాటికి సమీపంలోని షాపుల అద్దాలు పగిలిపోయాయి. మంటలు చెలరేగడంతో ప్రజలు భయంతో పరుగులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఆ ప్రాంతంలోని భవనాలపై ఆకుపచ్చ, ఎరుపు, నలుపు అఘారా జెండాలు, బ్యానర్లు వేలడదీశారు. అఘరా అనేది ఇస్లామిక్ నెల మొహర్రం 10వ రోజు. ఇది షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటి. ఇది ప్రస్తుత ఇరాక్ లో ఏడవ శతాబ్దంలో కర్బలా యుద్ధంలో ప్రవక్త మహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్, అతని 72 మంది సహచరుల అమరవీరత్వాన్ని సూచిస్తుంది.