అ గ్లోబల్ వార్మింగ్ ముగిసిన అధ్యాయం
అ పర్యావరణ మార్పులపై ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రెస్ ఆందోళన
న్యూయార్క్: పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. 1,20,000 సంవత్సరాల్లో ఈ జులై నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు. న్యూయార్క్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పరిణామంపై గుటెర్రెస్ మాట్లాడుతూ… గ్లోబల్ వార్మింగ్ యుగం ముగిసిందని, మరిగే యుగంలోకి అడుగుపెట్టామంటూ ఆందోళన వెలిబుచ్చారు. రికార్డు స్థాయిలో ధ్వంసమయ్యే ఉష్ణోగ్రతలు భూమిని వేడెక్కిస్తూ వచ్చాయని, ఇక నుంచి సలసల మరిగే పరిస్థితులను ఎదుర్కొబోతున్నాం అని వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా గ్లోబల్ వార్మింగ్ గురించే ఆందోళన చెందుతూ వచ్చాం కానీ… ఇక దాని గురించి ఆలోచన అక్కర్లేదు. ఎందుకంటే భూమి ఇప్పటికే వేడెక్కిపోయింది… ఇక నుంచి భూమి సలసల మరిగిపోతుందన్నారు. ఉత్తరార్థ గోళంలో నమోదు అవుతున్న తీవ్రమైన వేడిని… అత్యంత క్రూరమైన వేసవిగా అభివర్ణించారాయన. ఇది భూగ్రహానికి వచ్చిన విపత్తు అని, మంచు యుగం నుంచి చూసుకుంటే… ఈ జులైలో ప్రపంచ స్థాయి ఉష్ణోగ్రతలతో రికార్డులు బద్ధలయ్యాయని పేర్కొన్నారు. వాతావరణ మార్పు ఊహకందని వేగంలో జరిగిపోయింది. ఇక భయంకర పరిణామం… ఆరంభం అయ్యిందనే అనుకోవాలి. ఇంక హెచ్చరికలు ఉండవు… త్వరపడి చర్యలు చేపట్టాలంతే అని ప్రపంచ నేతలకు పిలుపు ఇచ్చారాయన.