. సమగ్ర భూసర్వే పటిష్టవంతం
. చేయూత కింద స్వయం ఉపాధి
. 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం
. అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం
. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: గ్రామ, పట్టణాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించాలని, సమగ్ర భూ సర్వే పటిష్టంగా అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖపై క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం సమీక్షించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలపై ముఖ్యమంత్రి సమీక్షించి, వాటి పరిస్థితిపై ఆరా తీశారు. దీంతో గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణం దాదాపుగా కొలిక్కి వచ్చిందని, సెప్టెంబరు నాటికి సుమారుగా అన్నిటిని పూర్తి చేస్తామని అధికారులు భావిస్తున్నారు. అటు జాతీయ ఉపాధిహామీ పథకంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. జాతీయ ఉపాధిహామీ పథకంలో ఈ ఏడాది లక్ష్యం 24 కోట్ల పని దినాలు ఉండగా, జులై వరకు 18.90 కోట్ల పని దినాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. మొత్తంగా రూ.9600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందని, ఇందులో వేతనాల కింద రూ. 3840 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామ, పట్టణాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణం కోసం అవసరమైన స్థలాలను ముందుగా గుర్తించాలన్నారు.
జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం కింద గ్రామాల్లో సర్వే పైనా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఈ సమీక్షలో 10,943 గ్రామాల్లో ఇప్పటికే డ్రోన్స్ సర్వే పూర్తయిందని, సర్వే పూర్తయిన తర్వాత ఆయా గ్రామాల్లో భూ హక్కుపత్రాలు ఇస్తున్నామని అధికారులు వివరించారు. సీఎం మాట్లాడుతూ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం విశిష్టమైనదని, ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేయర్ను నియమించడంవల్ల ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు వెళ్తుందన్నారు. గ్రామ సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
జగనన్న కాలనీలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. మౌలిక సదుపాయాలు దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ దృష్టి కేంద్రీకరించాలని, జగనన్న కాలనీలను ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నందున మౌలిక సదుపాయాలు విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు.
గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్ద (సెర్ఫ్) పైనా జగన్ సమీక్షించగా, వాటి వివరాలను అధికారులు వెల్లడిరదారు. ఈనెలలో ఇచ్చిన పెన్షన్లు 62,99,393, నెలకు పెన్షన్ల రూపేణా విడుదల చేసిన మొత్తం రూ.1735.36 కోట్లు, వైఎస్సార్ ఆసరా కింద మూడేళ్లలో ఇప్పటివరకూ అందించిన మొత్తం రూ.19,178.17 కోట్లు అందజేసినట్లు వివరించారు. వైఎస్సార్ సున్నావడ్డీ కింద రూ.4,969.05 కోట్లు. వైఎస్సార్ చేయూత కింద మూడేళ్లలో రూ.14,129.11కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షల మందికి జీవనోపాధి కల్పించినట్లు తెలిపారు. సీఎం మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు నాలుగేళ్లపాటు ప్రతి ఏటా రూ.18,750ల చొప్పున మొత్తంగా రూ.75వేలు ఇస్తున్నామన్నారు. ఆగస్టు 10న మహిళలకు సున్నా వడ్డీ కార్యక్రమం నిర్వహి స్తున్నామని చెప్పారు. స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు జగనన్న తోడు పథకం ప్రయోజనాల్ని వర్తింపజేయాలన్నారు. మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, మహిళల తరపున గట్టిగా మాట్లాడాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.