దశాబ్ది వేడుకల్లో జిన్పింగ్, షెహబాజ్
ఇస్లామాబాద్/ బీజింగ్: చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోవడం, చైనా అభివృద్ధి నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా పాకిస్తాన్ తమ ప్రజల కోసం మరింత సుసంపన్న, సుస్థిర భవిష్యత్ను నిర్మించుకోవడమే కాకుండా ప్రాదేశిక, అంతర్జాతీయ అభివృద్ధికి తోడ్పాటు అందించగలగడమే లక్ష్యమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడిరచారు. స్వీయసమృద్ధిగా ఎదగాలని, మరింత శక్తిమంతమైన దేశంగా నిలవాలని పాకిస్తాన్ ఆకాంక్షిస్తోందని తెలిపారు. 2013లో సీపెక్ మొదలై దశాబ్దం పూర్తి అయిన సందర్భంగా రాజధాని ఇస్లామాబాద్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ శుభాకాంక్షలు తెలుపుతూ పాకిస్తాన్కు సందేశాన్ని పంపారు. సీపెక్ ప్రాజెక్టులు రెండు దేశాల మధ్య స్నేహబంధాన్ని మరింత పటిష్ఠం చేశాయని జిన్పింగ్ అన్నారు. తమ మిత్రదేశమైనా పాకిస్తాన్కు ఎల్లప్పుడు అండగా ఉంటామన్నారు. తమ వ్యూహాత్మక బంధం కొత్త శిఖరాలను చేరుతుందని ఆకాంక్షించారు. బెల్డ్ అండ్ రోడ్లో సీపెక్ అంతర్భాగమని తెలిపారు. పాకిస్తాన్ సామాజిక-ఆర్థికాభివృద్ధికి గట్టి పునాదిగా సీపెక్ ఉంటుందన్నారు.
ఉన్నత ప్రమాణాలు, సుస్థిరత, జీవనోపాధి దిశగా మెరుగైన ఫలితాలను సాధించే దిశగా పాకిస్తాన్తో కలిసి చైనా పనిచేస్తుందని జిన్పింగ్ పేర్కొన్నారు. బెల్ట్ అండ్ రోడ్ అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో సహకారాన్ని అందించే ప్రాజెక్టుగా సీపెక్ను తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. చైనా, పాకిస్తాన్ను మరింత చేరువ చేస్తూ కొత్త శకంలో సమ్మిళిత భవిష్యత్కు తోడ్పడేదిగా సీపెక్ ఉండాలని జిన్పింగ్ ఆకాంక్షించినట్లు వేడుకల్లో పాల్గొన్న చైనా ఉప ప్రధాని హీ లైఫెంగ్ తెలిపారు. పాకిస్తాన్కు అధిక ప్రాముఖ్యత ఇస్తూ తమ దేశంలో సత్సంబంధాలను కొనసాగిస్తున్నందుకు జిన్పింగ్కు షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. సీపెక్ సయోధ్యకు పదేళ్లైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సీపెక్ నిర్మాణాత్మక విజయాలతో పాకిస్తాన్ అభివృద్ధి చెందిందన్నారు.