మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణ పరిశుభ్రత పట్ల ప్రజలు కూడా తమ సహాయ సహకారాలను అందించి పట్టణ ఆరోగ్య అభివృద్ధికి దోహదపడాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల డిమాండ్ల కోసం సమ్మెలో కొనసాగుతున్నారు. ఇటువంటి సమయంలో పట్టణ పరిశుభ్రత ను దృష్టిలో ఉంచుకొని క్లబ్ ఆటోలు, మరికొంతమంది పట్టణంలోని 40 వార్డులలో చెత్త సేకరణకు రావడం జరుగుతుందని, అలాంటి సమయంలో వ్యాపారస్తులు గాని, కుటుంబంలోని గృహిణులు నేరుగా చెత్తను ఆటోలోనే వేసే విధంగా సహకరించాలని వారు తెలిపారు. అంతేకాకుండా వ్యాపారస్తుల సముదాయం వద్ద గాని, వార్డులలోని గృహాల వద్ద గాని ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని అలా చేస్తే చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు. వార్డు ప్రజల సహాయ సహకారం లేనిదే పట్టణ పరిశుభ్రత సాధ్యపడదని తెలిపారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరిస్తుందని, అంతవరకు వార్డులు ప్రజలు కూడా పట్టణ పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, సచివాలయ ఉద్యోగులు కూడా పట్టణ పరిశుభ్రతలో తమ వంతుగా విధులను సేవా భావంతో కృషి చేస్తున్నారని తెలిపారు.