విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా, చోడవరం నియోజకవర్గం బుచ్చయ్య పేట మండలం మంగళాపురంలో అధికార పార్టీ అండ దండలతో నిర్వహించిన కోడి పందాలు లో రెండు వర్గాలు మధ్య జరిగిన స్వల్ప ఘర్షణల్లో ఎస్సీ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే బుచ్చయ్య పేట మండలం మంగళా పురంలో అధికారిక అనుమతులు ఉన్నాయంటూ అధికార పార్టీ అండ దండలతో నిర్వహించిన కోడి పందాలు లో రెండు వర్గాలు మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. పెద్దలు కొందరు సర్ది చెప్పి పంపించేశారు. కానీ మళ్ళీ వడ్డాది దొర వీధి కి చెందిన కొరసాల శ్రీరామ్ ఉరఫ్ బాహుబలి కొంత మంది యువకులను ఆటోలో తన వెంట తీసుకెళ్లి, వెంకటేశ్వర మహల్ వద్ద ఒంటరిగా కనిపించిన ఎస్సీ యువకుడు తేజ పై కోడి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తేజ తీవ్రంగా గాయపడటంతో హుటాహుటిన చోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడులతో రెండు వర్గాలు బాహాబాహుకి దిగడంతో వడ్డాది గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కొత్తకోట సిఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో బుచ్చయ్యపేట ఎస్సై డి. ఈశ్వరరావు, పోలీస్ సిబ్బంది వడ్డాదిలో పరిస్థితిని అదుపు తప్పకుండా చూస్తున్నారు. తేజ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు బుచ్చయ్యపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో దాడికి పాల్పడ్డ కె.శ్రీరామ్ పరారీ లో ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై బుధవారం వడ్డాది జంక్షన్లో పోలీసుల సమక్షంలో ఎస్సీ వర్గాలు మానవహారం చేపట్టాయి.