. ఏఐటీయూసీ నేతలు ఓబులేసు, రవీంద్రనాథ్ హెచ్చరిక
. కార్మికసంఘాల అధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో
. అరెస్ట్లు, తోపులాటతో ఉద్రిక్తత
. మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గనకు ఉద్యమ సెగ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అంగన్వాడీల సమ్మె మరింత ఉధృతరూపం దాల్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన శనివారం నాటికి 40వ రోజుకి చేరుకుంది. ప్రభుత్వం ఐదారు దఫాలు మొక్కుబడిగా చర్చలు నిర్వహించి, సమస్య పరిష్కారానికి ఏమాత్రం చిత్తశుద్ధితో కృషి చేయకపోవడంతో నాలుగేళ్లుగా ఓపిక పట్టిన అంగన్వాడీలు… తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఆందోళనను మరింత ఉధృతం చేశారు. వీరికి సంఫీుభావంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ నేతలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో కార్యక్రమాలు చేపట్టారు. విజయవాడలో కార్మిక సంఘాల నాయకులు చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తంగా మారింది. కార్మిక సంఘాల నాయకులు లెనిన్ సెంటర్కు చేరుకుని, అక్కడ నుండి ఏలూరు రోడ్డుపై రాస్తారోకోకు బయలుదేరారు. అప్పటికే భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు వారికి వ్యాన్లను అడ్డుపెట్టారు. మొత్తం నాయకులను చుట్టిముట్టి రాస్తారోకోకు అనుమతి లేదని నిలువరించారు. తాము శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తామంటూ నాయకులు వారిని తోసుకుని ముందుకు వెళ్లబోయారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగి కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం వారందరినీ అరెస్టు చేసి సుమారు 40 మందిని వ్యానుల్లో ఎక్కించి రాజరాజేశ్వరీ కళ్యాణ మండపానికి తరలించారు. అరెస్టయిన వారిలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.రవీంద్రనాథ్, జి.ఓబులేసు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలిత, సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎన్సీహెచ్ శ్రీనివాస్, నాయకులు నారాయణ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలారి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, పీవోడబ్ల్యూ నాయకులు పద్మ, కె.దుర్గ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుత పద్ధతిలో అంగన్వాడీల ఆందోళనకు సంఫీుభావం తెలుపుతున్న తమను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. వేలాది మంది మహిళలు రోడ్డెక్కి 40 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం ముఖ్యమంత్రి నైజాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు. సంక్రాంతి పండుగను సైతం జరుపుకోనివ్వకుండా ప్రభుత్వం మహిళలను వీధుల్లో నిలబెట్టడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు కావాలని, వారి సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పని చేస్తుందని చెబుతున్న మాటలు వట్టి బూటకమన్నారు. అంగన్వాడీల సమస్య న్యాయమైనదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారని వారు గుర్తు చేశారు. ఇతర చిన్న సమస్య పరిష్కారాన్ని కూడా సీఎం జటిలం చేయడం, ఆయన నియంతృత్వ ధోరణికి నిదర్శనమని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా అంగన్వాడీల సమస్య పరిష్కారానికి సీఎం జగన్ చొరవ చూపాలని, లేనిపక్షంలో మహిళాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
మంత్రులకు ఉద్యమ సెగ
అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంగన్వాడీల నుంచి నిరసన సెగ తగిలింది. ఈ నెల 23న సీఎం జగన్ పర్యటన ఉండటంతో సభాస్థలాన్ని పరిశీలించడానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పెద్దిరెడ్డి నగరానికి వచ్చారు. ఈ క్రమంలో కాన్వాయ్ను వెళ్లనీయకుండా అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాదాపుగా అరగంట పాటు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా లాగిపడేస్తూ అతికష్టం మీద మంత్రి వాహనాన్ని ముందుకు పంపించారు. డోన్లో అంగన్వాడీల రాస్తారోకో విషయాన్ని తెలుసుకుని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దారి మళ్లించి వెళ్లారు. అలాగే నెల్లూరులోనూ అంగన్వాడీలు చేస్తున్న నిరసన ఉద్రిక్తంగా మారింది. సీఐటీయూ అధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి వీఆర్సీ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలనే నినాదాలతో హోరెత్తించారు. దీంతో చాలాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు కిలోమీటరు మేర ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలో పోలీసులు-అంగన్వాడీల మధ్య తోపులాట జరిగింది.
డోన్లో ఉద్రిక్తత
అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని శనివారం డోన్ పట్టణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం రసాభాసగా మారింది. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు స్థానిక ఎల్ఐసీ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరసన చేపట్టారు. అదే సమయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి స్థానిక ఐటీఐ కళాశాలకు వెళుతున్నారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలగడంతో అక్కడికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.పుల్లయ్య, జి.అబ్బాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి.సుంకయ్య, ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మోట రాముడు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు అన్వర్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కో కన్వీనర్ జులేఖ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రణత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.