డిసిఎంఎస్ చైర్ పర్సన్ డా.అవనాపు భావన
యూత్ వింగ్ జోనల్ ఇంచార్జ్ అవనాపు విక్రమ్*
విశాలాంధ్ర -విజయనగరం : కుల,మత, జాతి, వర్ణ వివక్షత లేకుండా ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను కలిగించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం భారతీయులందరికీ సంతోషదాయకమని ఉమ్మడి విజయనగరం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్) చైర్ పర్సన్ డాక్టర్ అవనాపు భావన అన్నారు. శుక్రవారం రిపబ్లిక్ డే సందర్భంగా డిసిఎంఎస్ కార్యాలయంలో త్రివర్ణపతాకాన్ని ఆమె ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 200 ఏళ్ళు బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి అనంతరం 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రతి పౌరుడు దేశ సేవకు, దేశ అభివృద్ధిలో బాగస్వామి కావాలని కోరారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఎందరో మహనీయుల త్యాగాలను గుర్తు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ బాటలోనే నడుస్తూ, ఆమహానీయుని 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుచేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు. మెడికల్ కాలేజ్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లతో విజయనగరం జిల్లాను ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అభివృద్ది బాటలో నడిపించడాన్ని స్పూర్తిగా తీసుకుని డీసీఎంఎస్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, సంస్ధను బలోపేతం చేయడానికి తమవంతు కృషి చేస్తున్నామని భావన తెలిపారు.
భారతదేశం గణతంత్ర దేశంగా పరిఢవిళ్లడానికి విశేష కృషి చేసిన మహానీయులను ఆదర్శంగా తీసుకుని, నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ జోనల్ ఇంచార్జ్ అవనాపు విక్రమ్ పిలుపునిచ్చారు. జిల్లా డిసిఎంఎస్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమంతా నేడు అనుభవిస్తున్న స్వేచ్చ, స్వాతంత్రయాలు ఒకప్పుడు మహానీయుల త్యాగాల ఫలితమన్నారు. ఆ మహానీయుల స్పూర్తితో యువత ముందడుగు వేయాలని, ఎంతటి లక్ష్యాన్ని అయినా చేరుకోవాలంటే, మొదటి అడుగు ముఖ్యమైనదని, ఆ మొదటి అడుగు యువతదే కావాలని అవనాపు విక్రమ్ అకాంక్షించారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ బిజినెస్ మేనేజర్ సాయి కుమార్, సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.