ఒకరి అరెస్టు…బంగారు గొలుసు, ఇత్తడి గాజు, ఉంగరము మరియు సెల్ఫోను స్వాధీనం
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఏలాంటి ఆధారాలు లేని మహిళా హత్య కేసును సింగనమల సర్కిల్ పోలీసులు ఛేదించినట్లు జిల్లా అదనపు ఎస్పీ ఆర్ విజయ్ భాస్కర్ రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన వెంకటరమణ ఈనెల 3 వ తేదీ నార్పల పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. తన చెల్లెలయిన లక్ష్మీనారాయణమ్మ బండ్లపల్లి పప్పూరు గ్రామంలో ఫిబ్రవరి ఒకటో తారీకు నుంచి కనిపించడం లేదని చెబుతుండగానే… బండ్లపల్లి పప్పూరు గ్రామం నుండి లక్ష్మీనారాయణమ్మను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి అరటి తోటలో పూడ్చిపెట్టినట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు సదరు అరటి తోటలోకి వెళ్లి శవాన్ని వెలికి తీసి పరిశీలించగా లక్ష్మీనారాయణమ్మగా బంధువులు గుర్తించారు. ఫిబ్రవరి ఒకటో తేదీన లక్ష్మీనారాయణమ్మ చింతకాయల కోసం రామ నాయుడు అరటి తోటపక్కన ఉన్న చింత చెట్టు దగ్గరికి వెళ్లిందని… గుర్తు తెలియని దుండగులు హత్య చేసి అరటి తోటలో పూడ్చిపెట్టి వెళ్లి ఉండవచ్చని వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్పల పోలీస్ స్టేషన్లో హత్య కేసుగా నమోదు చేశారు.
ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసును త్వరితగతిన ఛేదించాలని జిల్లా ఎస్పీ శ్రీ కేకేన్ అన్బురాజన్ ఆదేశాలు జారి చేశారు. జిల్లా అదనపు ఎస్పీ ఆర్ విజయ భాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో అనంతపురం రూరల్ డిఎస్పి బి. వెంకట శివారెడ్డి ఆధ్వర్యంలో శింగనమల సిఐ వి శ్రీధర్, బుక్కరాయసముద్రం సీఐ వెంకటేశ్వర్లు, నార్పల ఎస్సై ఎన్ రాజశేఖర్ రెడ్డి మరియు సిబ్బంది ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ హత్య కేసును మూడు రోజుల్లోనే చేదించి నిందితుడు చల్లా నరేంద్ర వయసు 29 సం.లు, బండ్లపల్లి పప్పూరు గ్రామం, నార్పల మండలం పప్పూరు గ్రామంలో అరెస్టు చేశారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి ఒకటో తారీఖున నరేంద్ర అరటి తోటలోకి చనిపోయిన వ్యక్తి లక్ష్మీనారాయణమ్మ చింతకాయలు ఏరుకోవడానికి వెళ్లింది. ఆ సమయంలో చుట్టుప్రక్కల ఎవరూ లేనిది గమనించిన నరేంద్ర ఆమె మెడలో ధరించిన బంగారు గొలుసును లాగడానికి ప్రయత్నం చేశాడు. ఆసందర్భంగా ఆమె గట్టిగా కేకలు వేయగా చల్లా నరేంద్ర అందుబాటులో ఉన్న పదునైన రాయిని తీసుకొని ఆమె తలపై బలంగా కొట్టి ఆమెను చంపాడు. ఆమె ధరించిన బంగారు గొలుసు, ఇత్తడి ఉంగరము, ఇత్తడి గాజు మరియు సెల్ ఫోను తీసుకొని ఎటువంటి ఆధారాలు లేకుండా చేయాలని ఉద్దేశంతో చనిపోయిన మహిళ మృతదేహాన్ని సుమారు 2 అడుగుల లోతు గుంత తీసి కప్పి పెట్టాడు.
ఎలాంటి ఆధారాలు లేని ఈ హత్య కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన అనంతపురం రూరల్ డిఎస్పి బి.వెంకట శివారెడ్డిని, శింగనమల సీఐ శ్రీధర్, బుక్కరాయ సముద్రం వెంకటేశ్వర్లు, నార్పల ఎస్సై రాజశేఖర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ అభినందించారు.