విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద బార్బర్ యాక్టివిటీలో అర్హులైన అభ్యర్థులకు జన శిక్షణ సంస్థ శిక్షణా కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని జన శిక్షణ సంస్థ డైరెక్టర్ డా.సౌదగర్ తెలిపారు. మంగళవారం నగరంలోని నెహ్రూ యువకేంద్రంలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద బార్బర్ యాక్టివిటీలో అర్హులైన అభ్యర్థులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమం 7 రోజులు పాటు నిర్వహించడం జరుగుతుందని జన శిక్షణ సంస్థ డైరెక్టర్ తెలిపారు. శిక్షణ చివరి రోజున వారి నైపుణ్యాన్ని పరీక్షించి అర్హత సంపాదించిన వారికి విశ్వకర్మ ఐడెంటి కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణకాలంలో రోజుకు 500 రూపాయల భృతితో పాటు శిక్షణకు రానుపోను ఖర్చులకు వెయ్యి రూపాయలు చొప్పున ఒక అభ్యర్థికి ఇస్తామన్నారు. సదరు మొత్తాన్ని ఎన్.ఎస్.డి.సి వారు అభ్యర్థుల ఖాతాలో నేరుగా జమ చేస్తారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలను బ్యాచుల వారిగా 40 నుంచి 45 మందికి ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం శిక్షణ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి 44 మంది బార్బర్లు హాజరయ్యారన్నారు. ఈ సందర్భంగా డిఐసి జనరల్ మేనేజర్ నాగరాజారావు మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ అభ్యర్థులు ఈ శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జన శిక్షణ సంస్థ సిబ్బంది, పీఎం విశ్వకర్మ అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.