– వామ్స్ 2024 సదస్సులో భాగస్వాములవుతున్న అమెరికా సాంకేతిక నిపుణులు
–యువతను పరిశోధన రంగంలో ఆసక్తి కలిగించే విధంగా సదస్సు నిర్వహణ
విశాలాంధ్ర -విశాఖ సిటీ (విశాఖ జిల్లా): జిల్లాలోని రఘు విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి మార్చి 3వ తేదీ వరకు 3వ వైర్లెస్, యాంటినా మైక్రోవేవ్ సింపోజియం(వామ్స్ 2024) నిర్వహిస్తున్నట్లు సదస్సు జనరల్ చైర్ డాక్టర్ పి.ఎస్.అర్.చౌదరి తెలిపారు. ఆ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదస్సు వివరాలను ఆయన వెల్లడించారు. 29న సదస్సు కి జెఎన్టియూ విజయనగరం ఉపకులపతి ఆచార్య కె.వెంకట సుబ్బయ్య ముఖ్య అతిధిగా హాజరవుతారన్నారు. ఐఈఈఈ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు ఉపయుక్తంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహణ జరుగుతుందని వివరించారు. వర్తమాన పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలపై నిపుణులు ప్రసంగాలు ఉంటాయన్నారు. నూతన జ్ఞానాన్ని బదలాయింపు చేసుకోవడానికి, పరస్పరం పంచుకోవడానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందన్నారు. సదస్సులో భాగంగా టెక్నికల్ సెషన్స్, కీలకోపన్యాసాలు, వర్క్షాప్లు, ప్రత్యేక సెషన్స్, స్టూడెంట్ పేపర్స్, పోస్టర్ ప్రజెంటేషన్, ప్లీనరీ సెషన్స్ని నిర్వహిస్తున్నామన్నారు. సదస్సులో భాగంగా ఐఈఈఈ యంగ్ ప్రొఫెషనల్స్, విమెన్ ఇన్ ఇంజనీరిగ్, ఐఈఈఈ స్టూడెంట్ యాక్టివిటీ వంటివి నిర్వహిస్తామన్నారు.
రావ్ ఎస్ కన్సల్టెంట్స్ (అమెరికా) నిర్వాహకులు డాక్టర్ సుధాకర్ రావు మాట్లాడుతూ సదస్సులో 200 పరిశోధన పత్రాలను 300 మంది ప్రతినిధులు సమర్పిస్తారన్నారు. 43 అవార్డులను సైతం అందిస్తామన్నారు.
నాసా జెట్ ప్రొపల్షన్ లాబరేటరీ (అమెరికా) నిపుణుడు డాక్టర్ నాసిర్ చాహత్ మాట్లాడుతూ విద్యార్థులను భాగస్వాములను చేస్తూ సదస్సు జరుగుతుందన్నారు. టెక్రాలజీ రంగంలో వారిని ముందుంచే దిశగా నిపుణులు స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఉంటాయన్నారు. డాక్టర్ పావులో ఫోకార్డి మాట్లాడుతూ అంతరిక్ష రంగాలలో యువత తమ కెరియన్ని నిలుపుకునే విధంగా సదస్సు ఉంటుందన్నారు. డాక్టర్ గౌరంగి గుప్తా మాట్లాడుతూ టెక్నికల్ టాక్స్, ఇండస్ట్రీ ప్రజెంటేషన్స్, రీసెర్చ్ ప్రజెంటేషన్లు నిపుణులు అందిస్తూ, యువతను పరిశోధన రంగం దిశగా ఆసక్తిని కలిగిస్తారన్నారు.