విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే 07.03.2024ది. రాష్ట్రంలోని స్వయం భూ శివాలయాలన్నింటిలో ప్రసిద్ధిగాంచిన చోడవరం గంగా సమేత గౌరీశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు శివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలియజేశారు. ఆలయ చైర్మన్ గూనూరు సత్యనారాయణ దంపతులచే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, దేవాలయం సంప్రోక్షణ తో కళ్యాణ మహాశివరాత్రి ఉత్సవములు ప్రారంభించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి చలపతిరావు శ్రీనివాసరావులు తెలియజేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడువాక సత్య రావు దంపతులచే మహాన్యాస పూర్వక పంచామృత సహిత రుద్రాభిషేకం నిర్వహించారు. గుంటూరు పేర్రాజు దంపతులచే రుద్రహోమాన్ని ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్నం పేదలకు మహా అన్నదానం జరిపించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో ఎస్.వి.వి సత్యనారాయణమూర్తి తెలియజేశారు.