విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ వామపక్షాల రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ఆదోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా కార్య వర్గ సభ్యులు పరమేష్, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2021 డిసెంబర్ నెలలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు పరచాలని కోరుతూ ఢిల్లీ బయలుదేరిన రైతన్నలను హర్యానా రాష్ట్రం సరిహద్దుల్లోనే అడ్డగిండం దారుణమన్నారు. అలాగే మేకులు నాటడం, ముళ్ళకంపలు ఏర్పరచడం, డ్రోన్ ల ద్వారా విషవాయువులు చిమ్మించిందని విమర్శించారు. దీని వల్ల అనేక మంది రైతులకు కంటి చూపు కోల్పోవడం, చెవులు వినబడకపోవడం చాలా దారుణమని ఆరోపించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం అన్ని రకాల పంటలకు మద్దతు ధరలకు చట్టం చేయాలని, ఉపాధి హామీకి కేంద్రం బడ్జెట్ లో రెండు లక్షల కోట్లు కేటాయించి, 200 రోజుల పని దినాలు పెంచాలని, పోలవరం ప్రాజెక్టు నిధులు కేటాయించి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బికెఎంయు నాయకులు చంద్ర, నాయకులు తిక్కన్న, నాగరాజు, వీరేష్, కుంటెన్న, శ్రీరాములు, ఏఐవైఎఫ్ నాయకులు దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.