వైసీపీ నేతలు వెల్లడి
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతి అని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, సచివాలయ జేఏసీ కన్వీనర్ రవిచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ జనార్ధన్ ఆధ్వర్యంలో ఐకేపీ ఏరియా కో ఆర్డినేటర్ జనార్ధన్ అధ్యక్షతన వైఎస్ఆర్ చేయూత, ఆసరా పథకాల మెగా చెక్కుల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ. 18,750 చొప్పున 3399 మంది మహిళల బ్యాంకు ఖాతాలకు నాల్గో విడత రూ. 6 కోట్ల 37 లక్షల 66 వేలు సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా జమ చేశారని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో నాలుగు విడతలలో వైఎస్ఆర్ చేయూత కింద మొత్తం 44 కోట్ల 65 లక్షల 9 వేలు మహిళలకు ఎటువంటి దళారి వ్యవస్థ లేకుండా అవినీతికి ఆస్కారం లేకుండా అందజేశామని తెలిపారు. అలాగే వైఎస్ఆర్ ఆసరా పేరుతో డ్వాక్రా మహిళల రుణమాఫీ నాలుగు విడతలలో మండలంలోని 686 పొదుపు సంఘాలోని మొత్తం 6850 మహిళా సభ్యులకు మొత్తం (నాలుగు విడతలలో) రూ. 10 కోట్ల 73 లక్షల 52 వేలను సీఎం జగన్ పొదుపు గ్రూపుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారన్నారు. ఇంత మొత్తంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా మహిళామణులకు ఆర్ధిక సహాయం చేసిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు భవిష్యత్తులో పేదలకు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని హితవు పలికారు. జగన్ వలన మేలు జరిగి ఉంటే వైసీపీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వాదించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీపీ శ్రీవిద్య, జెడ్పీటీసీ రాజేశ్వరితో కలిసి పొదుపు మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొదుపు మహిళలకు వైఎస్ఆర్ చేయూత, ఆసరా పథకాల మెగా చెక్కులను పొదుపు సంఘాల మహిళలకు అందజేశారు. అలాగే మంచి సేవలందించిన వాలెంటీర్లను శాలువాలు కప్పి ప్రశంసా పత్రాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ మహేష్, ఏపీఎం సూర్య ప్రకాష్, గ్రామ సర్పంచులు రామాంజనేయులు, చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ రఘురామ్, వైసీపీ నాయకులు గజేంద్రరెడ్డి, శివరామిరెడ్డి, నరవ రాజశేఖర్ రెడ్డి, జాము మూకయ్య, అర్లప్ప, ముక్కరన్న అధిక సంఖ్యలో పొదుపు మహిళలు పాల్గొన్నారు.