విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పంచాయతీ కార్యదర్శి దస్తగిరి పూర్తిగా విఫలం చెందారని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్ విమర్శించారు. సోమవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు సిపిఐ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రజలకు తాగునీటిని శుద్ధి చేసి సరఫరా చేయాల్సి
ఉండగా, శుద్ధి చేయకుండానే నేరుగా సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమస్యల గురించి పంచాయతీ కార్యదర్శిని అడిగితే గ్రామ సర్పంచ్ పై నెట్టి వేస్తున్నారని ఆరోపించారు. కేవలం సమయాన్ని వృధా చేస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు. గ్రామంలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయని, కాని సమస్యల పట్ల పర్యవేక్షణ చేసింది శూన్యమని తెలిపారు . అలాగే మూడు నెలల కోసారి గ్రామ సభ నిర్వహించాలని, ఎప్పుడు నిర్వహిస్తారో తెలియడం లేదన్నారు. పంచాయతీకి వచ్చే నిధులను వార్డు సభ్యులకు తెలియజేసి వాటిని దేనికోసం ఖర్చు చేయ్యాలో సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా అలాంటిదేమి జరగడం లేదని విమర్శించారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి దస్తగిరికి పలుమార్లు విన్నవించినా సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఎంపీడీఓ స్పందించి పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసి వేరే పంచాయతీ కార్యదర్శిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, శ్రీరాం, తిక్కన్న, ఈరన్న, బిఎంకేయు నాయకులు చంద్ర, నల్లారెడ్డి, రంగన్న తదితరులు పాల్గొన్నారు.