చింతపల్లి, జీ కే వీధి ఎంపీపీ లు అనూష దేవి, కుమారి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మికి వైకాపా అధిష్టానం మరో మారు ఆ పార్టీ అల్లూరి జిల్లా అధ్యక్షురాలిగా నియమించడం హర్షనీయమని చింతపల్లి, జీ కే వీధి ఎంపీపీ లు కోరాబు అనూష దేవి, బోయిన కుమారి లు అన్నారు. వైకాపా అల్లూరి జిల్లా అధ్యక్షురాలుగా నియమితులైన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మోరి రవి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత లతో కలిసి గురువారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పరితపించే మనస్తత్వం కలిగిన భాగ్యలక్ష్మి పాడేరు శాసన సభ్యురాలిగా తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని చుట్టి వచ్చారన్నారు. అదేవిధంగా వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గడప గడపకు మన ప్రభుత్వం తో పాటు ప్రతి పథకాన్ని గడపగడపకు తీసుకెళ్లారన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన వారిని సైతం గుర్తించి వారికి అవసరమైన పత్రాలను ఇప్పించి ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించిన ఏకైక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. అటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడం బాధాకరమే అయినప్పటికీ, ఆమె పనితనాన్ని మెచ్చి పార్టీ ఆమెకు జిల్లా బాధ్యతలు అప్పజెప్పడం హర్సనీయమన్నారు. ఆమె నాయకత్వంలో జిల్లాలోని పార్లమెంట్, శాసనసభ స్థానాలన్నింటిని వైకాపా కైవసం చేసుకునేందుకు సులభతరం అవుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక ఎంపిటిసి సభ్యురాళ్లు దాసరి దారలక్ష్మి, చిందాడ జయలక్ష్మి, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ నాజర్ వల్లి, రెండు మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.