ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లాలో ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మంగళవారం రాత్రి 8.30 గంటలకు మట్టి గని దగ్గర మొరం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. ఓ డిస్టిలరీ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తీసుకొస్తున్న బస్సు కుమ్హారీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖాప్రీ గామం సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రమాదస్థలంలో 11 మంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు చనిపోయారు. 12 మందికిపైగా గాయపడ్డారు. బస్సు రోడ్డు పక్కకు జారి 40 అడుగుల లోతున్న గోయ్యిలో పడినట్లు సమాచారం.
దుర్గ్ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా పోస్టుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు సాధ్యమైన మేర సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించనున్నట్లు చెప్పారు. మరోవైపు ఉత్తరాఖండ్ నైనీతాల్ జిల్లాలో వాహనం లోయలో పడింది. మంగళవారం ఉదయం బేతాల్ఘాట్ దగ్గర వారు ప్రయాణిస్తున్న వాహనం 150 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల్లో ఏడుగురు నేపాల్కు చెందినవారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు (నేపాల్ పౌరులు) తీవ్రంగా గాయపడ్డారు. వాహనంలో మొత్తం 10మంది ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) ఎనిమిది మృతదేహాలను వెలికితీసింది. లోయలో పడిన వాహనంలో నేపాల్లోని మహేంద్రనగర్కు చెందిన తొమ్మిది మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. వారు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు.