అగ్నికి ఆహుతి అవుతున్న అడవులు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది మన్యంలో ఎండలు మండుతున్నాయి. నిత్యం శీతల వాతావరణానికి పేరెన్నిక గన్న మన్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు తీవ్ర ప్రతాపం చూస్తున్నాయి. ఈ ఎండల దాటికి కొండలలో కార్చిచ్చు రగులుతుంది. దీంతో అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. అడవులతో పాటు గిరిజనులు వాణిజ్య పంటగా పెంచుకునే కాఫీ, మిరియాల తోటలు, అదే క్రమంలో ఇతర వృక్ష సంపద అగ్ని కీలాల్లో చిక్కుకొని బూడిద మిగులుతుంది. అవగాహన లేని కొంతమంది ఆకతాయిలు ఎండిన ఆకులకు అగ్గి పెట్టి వెళ్లిపోవడంతో వేసవి కారణంగా ఎండిన ఆకులు ఒక్కటొక్కటిగా రాజుకుని అడవులను దహించి వేస్తున్నాయి. దీనివలన పర్యావరణానికి విఘాతం ఏర్పడుతుందని, వృక్ష సంపద అంతరించిపోవడం వలన సకాలంలో కాలానుగుణంగా కురవవలసిన వర్షాలు కురవక వ్యవసాయ పంటలు పండని పరిస్థితి నెలకొంటుందని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు అడవులను, వృక్ష సంపదను రక్షించుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ ప్రాంతీయులు భావిస్తున్నారు.