. అధికారంలోకి రాగానే ఉపాధి కల్పనపై శ్రద్ధ పెడతాం
. కేంద్రం సహాయ సహకారం రాష్ట్రానికి కావాలి
. తణుకు ప్రజా గళంలో చంద్రబాబు, పవన్
విశాలాంధ్ర – తణుకు : జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బుధవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొని ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ సుఖవంతమైన సినిమా జీవితాన్ని వదులకుని… ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్ కళ్యాణ్ అని అభినందించారు. ‘నాకు అనుభవం ఉంది… పవన్కు పవర్ ఉంది. అగ్నికి వాయువు తోడైనట్లు… ప్రజాగళానికి వారాహి తోడైంది. అహంకారాన్ని బూడిద చేస్తుంది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు కలిశాయి. సైకిల్ స్పీడ్కు తిరుగులేదు… గ్లాస్ జోరుకు ఎదురు లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం. వ్యక్తిగత దాడులు తట్టుకుని పవన్ నిలబడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదట చెప్పిన వ్యక్తి ఆయనే. చీకటి పాలన అంతానికి ఓటు చీలకూడదని చెప్పారు. యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్ పారిపోతాడు. విధ్వంస పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలో ప్రజలు ఆలోచించాలి. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి… అప్పుల పాలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం మద్దతు అవసరం. కేంద్రం మద్దతుతో శిథిల రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలుగుతాం. రైతును రాజుగా చేసే బాధ్యత నాది. రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేని పౌరసరఫరాల శాఖ మంత్రి తణుకులో ఉన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే మొదటి సంతకం చేస్తా. వలంటీర్ల వ్యవస్థ ఉంటుంది.. మీ జీతం రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచుతాం. రాజీనామా చేయొద్దు… మీకు అండగా ఉంటాం. మిమ్మల్ని చెడగొట్టాలని జగన్ చూస్తున్నారు. అధికారంలోకి రాగానే ఉపాధి కల్పనపై శ్రద్ధపెడతాం. కూటమి తరపున నిర్దిష్ట అజెండాతో ప్రజల ముందుకు వస్తున్నాం. కారుమూరు వంటి ముదురును నా జీవితంలో చూడలేదు. తణుకులో అభివృద్ధి చేయాలంటే కారుమూరుకు ట్యాక్స్ కట్టాలి. రూ.850 కోట్ల మేర టీడీఆర్ బాండ్ల స్కామ్ చేశారు. పేదల ఇళ్ల పేరిట స్థలాలు కొని ప్రభుత్వానికి అమ్మారు. ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్రంలో దాదాపు రూ.70వేల కోట్లు కొట్టేశారు’ అని చంద్రబాబు విమర్శించారు.
రైతును ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలి : పవన్
బూతులు తిట్టి, దాడులు చేసే మంత్రులు వైసీపీ కేబినెట్లో ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ‘తణుకులో జనసేన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా వెనక్కి తగ్గాం. బీజేపీ కోసం అనకాపల్లి ఎంపీ సీటును వదులకున్నాం. చంద్రబాబు కూడా తగ్గారు. రాష్ట్ర ప్రజల కోసమే ఇదంతా చేస్తున్నాం. దోపిడీపై దృష్టి ఉన్న నేతలు ప్రజల అవసరాలు ఎలా తీరుస్తారు? ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారు. మాట్లాడితే జగన్ క్లాస్ వార్ అంటారు. క్లాస్ వార్ అంటే అర్థం తెలుసా? డబ్బున్న వాళ్లు… కష్టపడే వారిని దోచుకోవడం. 70 వేల పోలీసు కుటుంబాలకు టీఏ, డీఏలు, సరెండర్ లీవ్స్ ఈరోజు వరకు ఇవ్వలేదు. పోలీసుల శ్రమశక్తిని కూడా దోపీడీ చేసే వ్యక్తి జగన్. జగన్ అహంకారాన్ని తుడిచిపెట్టే రోజులు వస్తాయి. ఐదు కోట్ల మందికి ఒకరిద్దరు సరిపోరు… మూడు పార్టీల బలం కావాలి. కేంద్రం సహాయ సహకారాలు రాష్ట్రానికి కావాలి. నాలుగు దశాబ్దాలుగా ఒడిదొడుకులు ఎదుర్కొన్న నాయకుడు చంద్రబాబు. ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం. ఆంధ్ర ప్రదేశ్ యువత భవిష్యత్తు బాగుండాలనే కొంత తగ్గాను. ఎక్కడ తగ్గాలో… ఎక్కడ నెగ్గాలో తెలుసు’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.