గుంటూరులో ‘ఇండియా’ భారీ ప్రదర్శన
ఎంపీ అభ్యర్థి ‘జంగాల’ను గెలిపించాలని నేతల అభ్యర్థన
విశాలాంధ్రగుంటూరు కార్పొరేషన్: గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ గుంటూరు నగరంలో ఇండియా కూటమి అధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక బీఆర్ స్టేడియం నుంచి పాతబస్టాండ్ మీదుగా విజయటాకీస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వరకు ప్రదర్శన సాగింది. డప్పు వాయిద్యాల నడుమ సాగిన ప్రదర్శనలో వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ఎర్రటి గొడుగులు, బూరలు, కంకి
కొడవలి, సుత్తి`కొడవలి నక్షత్రం, హస్తం గుర్తు పతాకాలు చేతబూని నినాదాలు చేసుకుంటూ కదం తొక్కారు. కార్మిక, కర్షక, మహిళా, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రదర్శనలో భాగస్వాములు అయ్యారు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ అధ్వర్యంలో ద్విచక్ర వాహనాలు ప్రదర్శన ముందు భాగంలో వెళుతుండగా దానిని అనుసరిస్తూ ప్రచార వాహనాలు ముందుకు సాగాయి. ఈ వాహన శ్రేణిని అనుసరిస్తూ కమ్యూనిస్టు శ్రేణులు…. వారి వెనుక టాప్ లేని వాహనంలో పార్లమెంట్ సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్కుమార్, తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి షేక్ మస్తాన్వలితో కలిసి సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ముందుకు కదిలారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో అనేక మంది మైనారిటీలు వక్తలకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘సోదర సోదరీమణులకు స్వాగతం’ అంటూ రాజా తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించి సభకు హాజరయిన వారిలో ఉత్సాహాన్ని నింపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దానితో జతకట్టిన రాష్ట్రంలోని ఆయా పార్టీల విధానాలను వక్తలు ఎండగట్టారు. దేశానికి ఇండియా కూటమి గెలుపు అనివార్యమని, బీజేపీని గద్దె దించి ఇండియా కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.