విశాలాంధ్ర ధర్మవరం: ఎన్నో ఏళ్లుగా ఉన్న విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ సమస్యను పరిష్కరించినందుకు మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ కు రైతులు కృతజ్ఞతలను తెలియజేశారు. ధర్మవరం రూరల్ లోని దర్శనమల గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫార్మర్ ఇచ్చినప్పటికీ దానికి సంబంధించిన విద్యుత్తు లైను అమర్చకపోవడం వల్ల రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై గత ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు, విద్యుత్ అధికారులు చుట్టూ ఎన్నోసార్లు రైతులు కాళ్ళరిగేలా తిరిగారు. ఆలోగా ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వము వచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో వారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రివర్యులు విద్యుత్ శాఖ సీఎండితో మాట్లాడి ఆ రైతుల సమస్యను వారం లోగా పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. తమ సమస్యను చెప్పిన వెంటనే పరిష్కరించిన మంత్రి సత్య కుమార్ రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.