రహదారిలో ఏర్పడిన గుంతలను గ్రామస్తులతో కలిసి శ్రమదానంతో పూడుస్తున్న ఎర్రబొమ్మల ఎంపీటీసీ సభ్యుడు సత్తిబాబు.
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- 80 లక్షల రూపాయల ఎంపీ నిధులతో కొండ వంచుల నుండి చినబరడ మీదుగా చిట్రాల గొప్పు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఎర్ర బొమ్మల ఎంపీటీసీ సభ్యుడు సెగ్గే సత్తిబాబు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ తమ పంచాయతీలోని కొండ వంచుల గ్రామం నుండి చినబరడ మీదుగా చిత్రాల గొప్పు వెళ్లే రహదారి దగ్గర మార్గానికి ఎంపీ గ్రాంట్ నుండి 80 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకు రావలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఇప్పటికే అవసరమైనచోట సిమెంట్ ర్యాంపులు పూర్తి చేసిన గుత్తేదారుడు మిగిలిన రహదారి నిర్మాణానికి సంబంధించి గ్రావెల్ వేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా కొంతమేరకు రహదారి కోతకు గురైంది అన్నారు. గ్రావెల్ వేసిన రహదారిలో కోతకు గురైన ప్రాంతాలలో రాకపోకలు ఇబ్బందికరంగా తయారయ్యాయన్నారు. దీంతో గుంతలు ఏర్పడిన చోట శ్రమదానంతో వాటిని పూడ్చుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికైనా సంబంధిత గుత్తేదారుడు, సంబంధిత అధికారులు స్పందించి ఈ రహదారి నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తే ఈ ప్రాంతంలోని గ్రామాల ప్రజలు వారు సాగు చేసి పండించిన ఫల సాయాన్ని, వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునేందుకు చిట్రాల గొప్పు మార్కెట్ కు తీసుకువెళ్లేందుకు శ్రమ తగ్గుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.