విశాలాంధ్ర- ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా బత్తలపల్లి నిడిమామిడి మఠం భూమి సర్వే నెంబర్ 401 లో పేదలు వేసుకున్న నిర్వాసితులతో కలిసి గుడిసెలకు పట్టాలు మంజూరు చేయాలంటూ నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి ముసుగు మధు, జింక చలపతి ఆధ్వర్యంలో ధర్మవరం ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మధు, జింక చలపతి మాట్లాడుతూ నేషనల్ హైవే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న గూడూరు మఠానికి చెందిన భూమిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచరులు పట్టాలు చేయించుకోవడం దారుణమన్నారు. అంతేకాకుండా ఆ భూమి పిత్రార్జితము అన్నట్లు రికార్డులను సృష్టించడం నియోజకవర్గ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసిందని వారు తెలిపారు. కోటి రూపాయల భూమిని కబ్జా చేయాలని ఉద్దేశంతోనే మాచిరెడ్డి గారి ఈశ్వర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో పాటు మిగతా వారిని కూడా ఇందులో చేర్చడం చూస్తూ ఉంటే అక్రమ దనార్ధన చేయాలన్న ధ్యేయంతోనే భూమిని కబ్జా చేయడం జరిగిందని తెలిపారు. కబ్జాకు పాల్పడిన వారు ఎవరైనా సరే వారిని జైలుకు పంపే వరకు ఎర్రజెండా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రజలకు సిపిఐ ఎండగా ఉంటూ వారికి ఇళ్ల స్థలాలను కచ్చితంగా కేటాయిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి ఎర్రం శెట్టి రమణ, జిల్లా చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి, బత్తలపల్లి సిపిఐ మండల కార్యదర్శి వెంకటేషు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కుల్లాయప్ప, శ్రీధర్, ఆదినారాయణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.