విశాలాంధ్ర బ్యూరో- నెల్లూరు : మాజీ పార్లమెంటు సభ్యులు , ప్రముఖ వ్యాపార వేత్త స్వర్గీయ మాగుంట సుబ్బరామి రెడ్డి గారి సతీమణి , పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారి వదిన మాగుంట పార్వతమ్మ (77) సెప్టెంబర్ 25 తెల్లవారుఝామున చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. ఆదివారం ఆమె పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఈ ఉదయం ఆమె కన్ను మూసారు. పార్లమెంటు సభ్యురాలిగా , శాసన సభ్యురాలిగా పార్వతమ్మ పలు హోదాలలో ప్రజలకి తమ సేవలందించారు. మాగుంట సుబ్బరామరెడ్డి దివంగతులైన తరువాత 1996లో తొలిసారిగా ఆమె రాజకీయ రంగప్రవేశం చేసి లోక్ సభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఆ తరువాత 2004లో ఆమె కావలి నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా ఎంపికయ్యారు.
అంత్యక్రియలు : ఆమె పార్థివ దేహాన్ని ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకి నెల్లూరు , సరస్వతి నగర్ లోని ఆమె స్వగృహానికి తీసుకురానున్నారు. అభిమానుల సందర్శనార్ధం రేపు అంటే సెప్టెంబర్ 26 వ తేదీ మధ్యాహ్నం వరకు వారి స్వగృహంలో ఉంచుతారు. గురువారంసాయంత్రం 3గంటలనుండి వారి అంతిమయాత్ర బయలుదేరుతుందని మాగుంట కుటుంబసభ్యులు తెలిపారు.