సర్పంచ్ దురియా పుష్పలత
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పంచాయతీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన గ్రామసభకు తమను ఆహ్వానించలేదని ఎన్డీఏ కూటమికి చెందిన తెదేపా, జనసేన నాయకులు ఆరోపించడం అర్ధరహితమని స్థానిక సర్పంచి దురియా పుష్పలత అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ మంగళవారం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభకు పంచాయతీ పాలక మండలి సభ్యులతో పాటు ఎన్డీఏ కూటమికి చెందిన తెదేపా, జనసేన బిజెపి నాయకులకు సమాచారం అందించడం జరిగిందన్నారు. సమాచారం అందించే సమయంలో ఒకరిద్దరు వారి వారి సొంత పనుల నిమిత్తం ప్రయాణాలలో ఉండడంతో అందుబాటులో లేని వారికి మినహా అందరికీ సమాచారం చేరవేయడం జరిగిందన్నారు. తెదేపా, జనసేన పార్టీలకు చెందిన అందుబాటులో ఉన్న నాయకులు గ్రామ సభకు హాజరు కావడం జరిగిందన్నారు. వారికి సభలో సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు. వారందరూ సభ ముగిసే వరకు సభలోనే ఉండి సహకరించారని, సభ ముగిశాక తమను ఆహ్వానించలేదని, తమకు సముచిత స్థానం కల్పించలేదని పత్రికా ప్రకటన ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ప్రతిసారి గ్రామసభను పార్టీలకు అతీతంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అదే సంస్కృతిని ఇక ముందు కూడా కొనసాగిస్తూ పంచాయతీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని ఎన్డీఏ కూటమి పార్టీల శ్రేణులకు ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.