విద్యుత్ సమస్యల తక్షణ పరిష్కారమే తమ లక్ష్యం
విద్యుత్ సమస్యలు ఉంటే 1912 కు ఫిర్యాదు చేయండి
కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ రిడ్రెస్సల్ ఫోరం చైర్మన్ డాక్టర్ బి సత్యనారాయణ
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : విద్యుత్ వినియోగదారులు తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం (సి జి ఆర్ ఎఫ్) సేవలను సద్వినియోగం చేసుకోవాలని సిజిఆర్ఎఫ్ చైర్మన్ డాక్టర్ బి సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలో స్థానిక విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సిజిఆర్ఎఫ్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం యొక్క విధివిధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ 1912 (కాల్ సెంటర్)కి ఫోన్ చేసి ఫిర్యాదులు తెలియజేసుకోవచ్చని, సమస్యలు పరిష్కారం కానీ ఎడల ఆ సమస్యలను లిఖితపూర్వకంగా తెలియజేస్తూ “చైర్మన్ కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ రిడ్రెస్సల్ ఫోరం (సి జి ఆర్ ఎఫ్), ఏపీ ఈపీడీసీఎల్, కార్పొరేట్ కార్యాలయం, విశాఖపట్నం కు పోస్ట్ ద్వారా తెలియపరచవచ్చని, ల్యాండ్ లైన్ నెంబర్ 08942 2564704 నెంబర్ కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయవచ్చని తెలిపారు. సిజిఆర్ఎఫ్ సాంకేతిక సభ్యులు వి జనార్ధన రావు మాట్లాడుతూ ఈ న్యాయస్థానం 2005వ సంవత్సరం నుండి పనిచేస్తుందని, ఇప్పటివరకు 7866 సమస్యలు పరిష్కరించామని, 5 లక్షల 55 వేల 50 రూ. నష్టపరిహారంగా వినియోగదారులకు చెల్లించడం జరిగిందని, ప్రస్తుతం 139 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 2023 వ సంవత్సరంలో 325 కేసులు విద్యుత్ వినియోగదారులకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని, ఆ తీర్పుల కాపీలను వినియోగదారులకు పోస్టు ద్వారా మరియు విద్యుత్ శాఖ ద్వారా అందజేశామని పేర్కొన్నారు. ఈ సి జి ఆర్ ఎఫ్ పరిధిలో ఉమ్మడి 5 జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల వరకు ఉందని, ప్రతినెల ప్రతి జిల్లాలో క్యాంపు కోర్టు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. నేడు జరిగిన సదస్సులో వివిధ సమస్యలపై విద్యుత్ వినియోగదారుల నుంచి మూడు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ టెక్నికల్ డిఈ విఎస్ సాయిబాబా, పాడేరు డిఈ ఎన్ అప్పారావు, చింతపల్లి ఏడిఈ సూర్య ప్రకాష్, చింతపల్లి, జి మాడుగుల, కొయ్యూరు ఏఈ లు వీ ప్రభాకర్ రావు, ఎంవి రమణ, కె నాగేశ్వరరావు, ఆ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.