గోరంత సాయం.. కొండంత ప్రచారం..
విశాలాంధ్ర- బుక్కరాయసముద్రం: ప్రకృతి విపత్తులు, ఆకాశాన్ని తాకిన విత్తనాలు ధరలు, ఎరువులు, పంటలకు ఖర్చు చేసే భారం పెరిగి .. ఆశించిన దిగుబడి లేక కన్నీరు పెడుతున్న రైతును ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం పట్టణంలోని సంగమేశ్వర నగర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రైతు సంఘం సి. మల్లికార్జున, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. జిల్లాలో వేరుశనగ, పత్తి, ఆముదం, చీని, దానిమ్మ అరటి ,బొప్పాయి నష్టపోయిన ప్రతి రైతుకు పంటల బీమా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 680 కోట్లు నష్టపోతే కేవలం 111.80 కోట్లు ఇచ్చి రైతులను కన్నీరు పెట్టిస్తున్నారన్నారు. 2022 ఖరీఫ్ లో వేసిన ప్రతి పంటకు బీమా ఇస్తామని చెప్పి.. పరిహారం సమయంలో దిగుబడి ఆధారంగా బీమా ఇస్తామని చెబుతూ.. కనీస దిగుబడి లేకపోయినా బీమా ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను మోసగించిందన్నారు. అనంతపై సీఎం జగన్ పంటల బీమా గోరంత సాయం.. కొండంత ప్రచార చేసి 1.37 లక్షల మంది రైతులకు మాత్రమే పరిహారం ఇచ్చారన్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకు భీమాను ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.