మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం పేదల పాలిట వరంగా మారిందని, 11 రకాల సర్టిఫికెట్లను అతి కొద్ది రోజుల్లోనే ఇవ్వడం అనేది ప్రగతికి నిదర్శనమని మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని తొలిసారిగా ఆరవ, ఏడవ, ఎనిమిదవ వార్డులలో గల శివానగర్, తిక్క స్వామి నగర్, కేశవ నగర్ లలోని ప్రజల నిమిత్తం మంగళవారం శివానగర్లోని పార్కు నందు ఏర్పాటు చేశారు. అనంతరం ఆ వార్డు ప్రజలకు జగనన్న సురక్ష కార్యక్రమ యొక్క వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఘనంగా విజయవంతం కావడం జరిగింది. సచివాలయాల్లో ఇదివరకే 11 రకాల సర్టిఫికెట్లకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ కూడా సర్టిఫికెట్లను చైర్మన్, కమిషనర్, ఆ వార్డు కౌన్సిలర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి లు మాట్లాడుతూ 11 రకాల సర్టిఫికెట్లకు సర్వీస్ ఫీజు లేకుండా పూర్తిగా ఉచితంగా సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. జూన్ 24వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ఇంటింటా తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కార దిశలో కృషి చేస్తున్నారని తెలిపారు. పట్టణంలోని ప్రజలందరికీ 11 రకాల సర్టిఫికెట్లను అందజేసేందుకు ఈనెల 4 తేదీ నుండి 24వ తేదీ వరకు నిరంతరంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జగనన్న సురక్ష కార్యక్రమం కు టీం లీడర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఏ వ్యక్తి నుంచి కూడా ఫిర్యాదు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. వార్డ్ ప్రజల నుంచి కూడా ఎంతో స్పందన వస్తోందని, గతంలో రోజుల తరబడి ఈ సర్టిఫికెట్లకు తాము కాళ్లు అరిగేలా తిరిగేవాళ్ళమని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కావలసిన సర్టిఫికెట్లు ఇంత తొందరగా ఇవ్వడం మాకెంతో సంతోషాన్ని, తృప్తిని ఇస్తోందని ప్రజలు తెలపడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. కులం, మతం, ప్రాంతం పార్టీలు చూడకుండా, లంచాలు, వివక్షత లేకుండా అర్హత ఒకటే ప్రామానికంగా తీసుకొని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం అర్హులైన వారందరికీ కూడా 11 రకాల సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. తదుపరి శివానగర్, తిక్క స్వామి నగర్, కేశవ నగర్ నుంచి 2,270 దరఖాస్తులు వచ్చాయని వాటిని కూడా పర్యవేక్షణ జరిపి, త్వరలోనే సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గడ్డం వరలక్ష్మి బ్రహ్మయ్య ఆచారి మాసపల్లి సాయికుమార్ టిపిఓ సుబ్బరాయుడు ఎన్నికల తహసిల్దార్ అనిల్ కుమార్ రెడ్డి మున్సిపల్ మేనేజర్ ఆనంద్ డి ఈ వన్నూరు స్వామి, సచివాలయ అడ్మిన్లు శంకర్ రెడ్డి,వెంకటేశులు, కర్రీమున్, సచివాలయ ఉద్యోగులు, వార్డుల ప్రజలు పాల్గొన్నారు.