ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పోతలయ్య
విశాలాంధ్ర – ధర్మవరం : విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈనెల 25న రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతలయ్య, నియోజకవర్గ అధ్యక్షులు బండి శివ, పట్టణ అధ్యక్షులు సాయికిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా, విద్యా వ్యవస్థలో తగిన మార్పులు రావటం లేదని, కేజీ నుండి పీజీ విద్య సంస్థల వరకు బందుకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. నేటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విద్యార్థులకు సౌకర్యాలను కల్పించడంలో, విద్యార్థుల అభివృద్ధికి పాటుపడడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్ మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని, 3వ, 4వ, 5వ తరగతులను విలీన ప్రక్రియ నిలుపుదల చేయాలని, కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీలను వెంటనే అరికట్టాలని, జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం యధావిధిగా కొనసాగించాలని, విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీ కోర్సులో4 సంవత్సరాలు కాకుండా 3 సంవత్సరాలుకే కొనసాగించాలని, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర పోస్టులు కూడా వేలు వెంటనే భర్తీ చేయాలని, జీవో నెంబర్ 77 ను వెంటనే రద్దు చేయాలని తెలిపారు. ఈ రాష్ట్ర బందును ఏఐఎస్ఎఫ్ తో పాటు టిఎన్ఎస్ఎఫ్, పిడిఎస్యు, ఎన్ఎస్యు ఐ,ఏఐఎస్ఏ, ఏ ఐడిఎస్ఓ విద్యార్థి సంఘాలు పాల్గొంటున్నాయని తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికై విద్యార్థినీ విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొని, బందును విజయవంతం చేయాలని తెలిపారు.