విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన కేశినేని శ్రీనివాస్(నాని) ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్లో సోమవారం ఆయన పోస్ట్ చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి రాజీనామా చేసి… వైసీపీ తరపున ఎంపీగా ఆయన పోటీ చేశారు. తన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో ఓటమిపాలయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. విజయవాడ పార్లమెంట్ ఎన్నికల్లో పదేళ్లుగా కేశినేని నాని కీలకంగా వ్యవహరించారు. వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచి…విజయవాడ నగరంతోపాటు నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేశారు. టీడీపీలో నెలకొన్న వర్గ విభేదాల కారణంగా ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. విజయవాడ ప్రజల దృఢసంకల్పం తనకు స్ఫూర్తినిచ్చిందని, అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తాను పాలుపంచుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల అభివృద్ధికి తన వంతు కృషి చేశానని, భవిష్యత్లోనూ విజయవాడ అభివృద్ధికి తన మద్దతు ఇస్తూనే ఉంటానన్నారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అన్ని విధాలుగా ఆలోచించాకే రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయించినట్లు కేశినేని నాని స్పష్టం చేశారు.