ఎన్డీఏ కూటమి ఓటమితో దేశానికి విముక్తి: సీహెచ్ కోటేశ్వరరావు
విశాలాంధ్ర-మైలవరం: ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపే దేశ మనుగడకు మలుపని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ కోటేశ్వరరావు అన్నారు. ఇండియా కూటమి బలపరిచిన మైలవరం కాంగ్రెస్ అభ్యర్థి బొర్రా కిరణ్, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు భార్గవ విజయాన్ని కాంకిస్తూ సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కోటేశ్వరరావు మాట్లాడుతూ కరుడుగట్టిన మతోన్మాది, అణువణువునా ఫాసిస్టు భావాలు జీర్ణించుకున్న మోదీ, అమిత్ షా కబంద హస్తాల్లో దేశం పదేళ్లలో అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందన్నారు. దేశానికి విముక్తి కలిగించాలంటే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని చిత్తుచిత్తు గా ఓడిరచాలని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి దేశ మనుగడకు పాటుపడాలన్నారు. మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యాని పెనుముప్పు ఏర్పడుతుందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపౌరుడు దేశాన్ని కాపాడుకునేందుకు ఈ ఎన్నికలు ఓ సదవకాశమన్నారు. ఎన్డీఏ ముసుగులో ఉన్న దేశద్రోహులను ఓడిరచాలన్నారు. కిరణ్, భార్గవ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి, మైలవరం నియోజకవర్గ కార్యదర్శి బుడ్డి రమేశ్, ఎన్టీఆర్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సీహెచ్ దుర్గా కోటేశ్వరరావు, సీపీఐ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆజ్మీ అయ్యా, అగోతు నాగేసు, పీ సాంబయ్య , ఏ సుబ్బారావు, రత్నకుమారి, వీరాస్వామి పాల్గొన్నారు.