పల్నాటి ముఖద్వారం రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఆనవాయితీతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎన్నికల ముఖచిత్రం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. హేమాహేమీలను గెలిపించి… మహోన్నత వ్యక్తులను ఓడిరచి… కమ్యూనిస్టులకు అండగా నిలచి… ప్రతి ఎన్నికలలో తనదైన విభిన్న తీర్పులు ఇస్తూ… రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీని నిర్ణయించడంలో సత్తెనపల్లి ప్రజలు తమదైన గుర్తింపు సాధించుకున్నారు. స్వాతంత్ర సమరయోధులను అక్కున చేర్చుకొని తదనంతర పరిణామాలలో కమ్యూనిస్టుల వైపునకు సత్తెనపల్లి మొగ్గింది. ప్రతి ఎన్నికలలో మారుతున్న రాజకీయ కూటములలో కొన్ని నిలకడగా పయనిస్తున్నాయి… మరికొన్ని పార్టీలు అద్దాల సౌదాలను నిర్మించుకున్నాయి. ఈ నియోజకవర్గ ఏర్పడిన తర్వాత 1952లో జరిగిన తొలి ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన స్వాతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి జెట్టి అంకమ్మపై 7,349 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. 1955 ఎన్నికలలో భారత కమ్యూనిస్టు పార్టీ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి బండారి వందనంపై 875 ఓట్లతో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు. 1962లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన వావిలాల కాంగ్రెస్ అభ్యర్థి మేడూరి నాగేశ్వరరావు పై 4,685 ఓట్లతో గెలుపొందారు. 1967లోనూ అదే అభ్యర్థిపై 2,443ఓట్లతో విజయం సాధించారు. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీరాంజనేయ శర్మకు సత్తెనపల్లి ఓటర్లు పట్టం కట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వావిలాలను 809 ఓట్లతో శర్మ ఓడిరచారు. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రావేల వెంకట్రావు సీపీిఎం అభ్యర్థి పుతుంబాక వెంకటపతిపై 9,369 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సినీ నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా ఆ పార్టీ తరపున మహిళా అభ్యర్థి నన్నపనేని రాజకుమారి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యరి,్థ రాజకీయ దురంధరుడు చేబ్రోలు హనుమయ్యపై 19,668 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 1985 ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన సీపీఎం అభ్యర్థి పుతుంబాక వెంకటపతి… కాంగ్రెస్ అభ్యర్థి జేయూ పద్మలతపై 9,351 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1989 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి దొడ్డ బాలకోటిరెడ్డి … సీపీఎం అభ్యర్థి వెంకటపతిపై 13,928 ఓట్లతో విజయం సాధించారు. 1994లో వామ పక్షాలు బలపరిచిన సీపీఎం అభ్యర్థి పుతుంబాక భారతి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి రాయపాటి శ్రీనివాస్పై 2,337 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యలమంచిలి వీరాంజనేయులు… కాంగ్రెస్ అభ్యర్థి చేబ్రోలు హనుమయ్యపై 10,693 ఓట్లతో గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో స్థానిక నినాదంతో బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి యర్రం వెంకటేశ్వర్ రెడ్డి… టీడీపీ అభ్యర్థి కల్లం అంజిరెడ్డిపై 24,410 ఓట్ల మెజార్టీని సాధించి రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డును తిరగరాసిన నేతలు సత్తెనపల్లిలో లేరు. 2009లో టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల రాజనారాయణపై యర్రం వెంకటేశ్వర్ రెడ్డి (కాంగ్రెస్) 7,147 ఓట్లతో గెలిచారు. ఆ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున బైరా దిలీప్ చక్రవర్తి పోటీ చేసి 25,715 ఓట్లు సాధించాడు. ఇది ఆ ఎన్నికల ఫలితాలను నిర్దేశించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున డాక్టర్ కోడెల శివప్రసాదరావు వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 924 ఓట్లతో విజయం సాధించారు. 2019 ఎన్నికలలో వైసీపీ తరపున అంబటి రాంబాబు… కోడెల శివప్రసాదరావుపై 20,876 ఓట్ల మెజారిటీతో విజయం సాధించించారు. ఆపై మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థిగా అంబటి రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపున కన్నా లక్ష్మీనారాయణ బరిలో నిలిచారు. ఇద్దరూ ఒకటే సామాజిక వర్గం వారు కావడంతో పోటీ రసవత్తరంగా సాగబోతోంది.
ఇదిలావుంటే తొలుత కన్నా లక్ష్మీనారాయణ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఆశావాహులైన మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, అబ్బూరి నాగమల్లేశ్వరరావు, కోడెల శివరాం వ్యతిరేకించారు. అనంతరం సంప్రదింపులు మీదట కన్నా విజయం కోసం ఆంజనేయులు ప్రచార బాట పట్టారు. కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాం అలక వీడకపోవటంతో టీడీపీ అధినేత చంద్రబాబు తన వద్దకు పిలిపించుకొని సయోధ్య కుదిర్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మధ్య సయోధ్య కుదరడంతో కన్నా తన రాజకీయ చతురతకు పదును పెట్టారు. తన తనయులు నాగరాజు, ఫణీంద్ర ద్వితీయ శ్రేణి నాయకులను మమేకం చేసుకొని నియోజకవర్గంలో పర్యటించారు. గతంలో కన్నాకు అండగా నిలిచిన రాజుపాలెం మండలం… సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశం. ప్రస్తుత మంత్రి అంబటి అభ్యర్థిత్వాన్ని రెడ్డి సామాజిక వర్గం బహిరంగంగా వ్యతిరేకించింది. ప్రధానంగా మాజీ శాసనసభ్యులు యర్రం వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టా విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణ్ రెడ్డి, నలంద వరప్రసాద్ రెడ్డి… అంబటి అభ్యర్థిత్వాన్ని ససేమిరా అన్నారు. నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చొరవతో వీరందరినీ ముఖ్యమంత్రి జగన్ వద్దకు తీసుకెళ్లి సయోధ్య కుదిరించారు. అప్పటి నుంచి అంబటి తనదైన శైలిలో బుల్లెట్ పై స్వారీ చేస్తూ నియోజకవర్గాన్ని చకచకా చుట్టి వచ్చారు. ఇటీవల జరిగిన జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర తనకు మరింత బలాన్ని ఇచ్చిందంటూ ఉత్సాహంగా నామినేషన్ దాఖలు చేశారు. అంబటి తన కుటుంబం మొత్తాన్ని ఎన్నికల ప్రచార రంగంలోకి దించి… ప్రతి గ్రామంలో ప్రచారం సాగిస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులలో ఒకరిది రాజకీయ చాతుర్యత … మరొకరిది వాగ్దాటి బలం కావడంతో సత్తెనపల్లి రాజకీయం రసవత్తరంగా మారింది. సత్తెనపల్లి సీటు ఎవరు గెలిస్తే వారే రాష్ట్రంలో అధికారం చేపడతారని గత చరిత్ర చెబుతుండటంతో ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఏ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ ప్రభుత్వమే వస్తుందంటూ విస్తృత ప్రచారం సాగుతోంది. ఇక్కడ ప్రజలు కొత్తగా నియోజకవర్గానికి వచ్చిన కన్నాను అక్కున చేర్చుకుంటారో వావిలాల, యర్రం లాగా అంబటిని రెండవసారి గెలిపిస్తారో వేచి చూడాలి.విశాలాంధ్ర
సత్తెనపల్లి