అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అయింది. 2014 నుంచి విద్వేష రాజకీయాలను కొనసాగిస్తున్న మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న సంకల్పానికి ఆచరణ రూపం ఇవ్వడానికి ప్రతిపక్ష పార్టీల మధ్య స్థూలంగా అంగీకారం కుదిరింది. ఈ ప్రతిపక్ష పార్టీల మధ్య రాష్ట్రాల స్థాయిలో విభేదాలున్నప్పటికీ వాటిని అధిగమించి 2024 లోకసభ ఎన్నికలలో కలిసికట్టుగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం సానుకూల పరిణామం. 2014 నుంచి కొనసాగుతున్న మోదీ ప్రభుత్వం విద్వేష రాజకీయాలను పెంచి పోషిస్తుండడంవల్ల దేశ సమైక్యతను కాపాడడానికి ఐక్యంకాకతప్పదని ప్రతిపక్షాలు గ్రహించాయి. దీనికోసం చాలా కాలం నుంచే ప్రయత్నాలు మొదలైనాయి. మొట్ట మొదట ప్రతిపక్షాల ఐక్యతా రాగం ఎత్తుకున్నది మమతా బెనర్జీనే అయినప్పటికి ఆమె ప్రణాళికలో అతి పెద్ద ప్రతిపక్షం అయిన కాంగ్రెస్కు, వామపక్షాలకు స్థానం ఉండాలని అనుకోలేదు. మమతా బెనర్జీ కోరుకున్న ప్రతిపక్షాల ఐక్యత ఆ దశలో బీజేపీకి వ్యతిరేకమైన ప్రాంతీయ పార్టీలను కూడగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఉండేది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీతో కలిసి నడుపుతున్న ప్రభుత్వానికి మంగళంపాడి లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరవాత కాంగ్రెస్ను మినహాయించకుండా విస్తృతమైన ప్రతిపక్షాల ఆవశ్యకతను గుర్తించారు. అప్పటి నుంచి ఆయన నిరంతరం ఈ లక్ష్య సాధనకోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఈ ప్రతిపక్ష సంఘటనకు (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్-భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి ఇండియా) అని పేరుపెట్టారు. నరేంద్ర మోదీ దుష్పరిపాలనను అంతం చేయడానికి జాతీయ పార్టీలు, బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఐక్యం కావడం కచ్చితంగా బీజేపీ గుండెల్లో దడ పుట్టించక మానదు.
మోదీ హయాంలో సాగుతున్న నియంతృత్వ పోకడలు, తన మిత్ర పక్షాలనే డబ్బు సంచులు కుమ్మరించి కబళించడంవల్ల ప్రజాస్వామ్య సంప్రదాయాలు కొనసాగాలనుకునే పార్టీలకు విపరీతమైన ఆవేదన కలిగించింది. మోదీ హయాంలో భారత్ అన్న భావనే అడుగంటి పోవడం కూడా ప్రతిపక్ష పార్టీలను కలచి వేసింది. దీనికి తోడు మోదీ సర్కారు ఎన్నికల కమిషన్ను, కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటినీ తన పరిచారికలుగా మార్చుకుని పని గట్టుకుని ప్రతిపక్ష నాయకులందరి మీదా అవినీతి ఆరోపణలు మోపడం, అరెస్టు చేయడం, నెలల తరబడి జైళ్లల్లో మగ్గేట్టు చేయడం పౌర సమాజ సంఘాలనూ ఇదే రీతిలో వేధించడం, నిర్బంధించడం ప్రతిపక్ష పార్టీలలో ఆలోచన రేకిత్తించింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి ప్రయత్నమే జరిగింది కానీ అది చాలా బలహీనమైన అడుగే. ‘‘సమైక్యంగా ఉంటే నిలబడతాం’’ అని ప్రతిపక్షాలు ఇప్పుడు స్పష్టంగా గ్రహించాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ అవినీతికరమైనవే అని మోదీ ఇల్లెక్కి అరుస్తున్నా అసలు అవినీతి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలోనే గూడు కట్టుకుని ఉందని, అన్నింటికీ మించి మోదీ పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని నిరంకుశ పాలనగా దిగజార్చారని ప్రతిపక్షాలు గుర్తించాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతిపక్షాలకు తావే కరవయ్యే ప్రమాదం పొంచి ఉందని ఈ పక్షాలు ఆవేదన చెందాయి. పేరుకు ప్రతిపక్ష పార్టీల జాబితాలో ఉన్నా చాలాకాలం బీజేపీకి తమ్ముడిలా వ్యవహరించిన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చివరకు స్వానుభవం అయితే తప్ప మోదీ పరిపాలన అంతస్సారం ఏమిటో బోధ పడలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను కేసులలో ఇరికించి నిర్బంధంలో ఉంచడం, దిల్లీ పాలనాధికారాలు ప్రభుత్వానివే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన వెంటనే ఆ తీర్పును వమ్ముచేస్తూ ఆర్డినెన్సు జారీ చేయడం లాంటి వరస సంఘటనలు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీని ఎదిరించక తప్పని స్థితిలోకు నెట్టాయి. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సును వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తేనే ప్రతిపక్ష సమావేశానికి హాజరవుతానని కేజ్రీవాల్ పట్టుబట్టారు. కానీ ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను కాంగ్రెస్ ఎన్నడూ సమర్థించబోదని చెప్పిన తరవాత ప్రతిపక్షాలతో గొంతు కలపకుండా ఒంటరిగా ఉంటే ఫలితంలేదని కేజ్రీవాల్ గ్రహించక తప్పలేదు.
మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకునే కె.చంద్రశేఖర రావు నాయకత్వంలోని భారతీయ రాష్ట్ర సమితి (మునుపు టి.ఆర్.ఎస్.), మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ ప్రతిపక్ష ఐక్యత అవసరాన్ని ఇప్పటికీ గ్రహించడంలేదు. తమ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితి ఆధారంగా మాత్రమే ఈ రెండు పార్టీలు తమ విధానాలకు పదును పెడ్తున్నాయి.
ఉత్తరప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన అఖిలేశ్ యాదవ్ నాయకత్వం లోని సమాజ్వాది పరిస్థితి కొంచం ఇంచుమించుగా ఇదే. అందుకని ఆయన పట్నా సమావేశానికి, బెంగళూర్ సమావేశానికి హాజరు కాలేదు. తన ఒక్క పార్టీనే బీజేపీని ఢీకోనగలదన్న మేకపోతు గాంభీర్యాన్ని అఖిలేశ్ ఇంకా విడనాడడం లేదు. ఇలాంటి పార్టీలకు విద్వేష రాజకీయాలు నడుపుతున్న మోదీ నాయకత్వంలోని బీజేపీవల్ల పొంచి ఉన్న ముప్పు గురించి అవగాహన ఉన్నట్టు లేదు. 2022 శాసనసభ ఎన్నికలలో సమాజ్వాది పార్టీ 111 స్థానాలు సంపాదించింది. 2017లో కేవలం 47 సీట్లే ఉండేవి. ఇదంతా తమ ఘనతేనన్న భావన అఖిలేశ్ యాదవ్లో గూడు కట్టుకుంది. కానీ మోదీ ఏలుబడిలో పెరుగుతున్న జాతీయ విపత్తు గురించి ఆయనకు పట్టినట్టు లేదు. రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్.ఎల్.డి.) నాయకుడు జయంత్ చౌదరీ కాంగ్రెస్తో ఐక్యత అత్యవసరమని అఖిలేశ్ చెవికి ఎక్కడం లేదు. ప్రధానమంత్రి పదవి మీద కాంగ్రెస్ కు అంత ఆసక్తి లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖడ్గే బెంగళూరులోనే ప్రకటించడం విశేషమే. కానీ ఆ వెంటనే ఆయన 2024లో దళితుడు ప్రధానమంత్రి కావచ్చు అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. ప్రతిపక్షాలు ఐక్యమైతే తమపని ఖాళీఅని గ్రహించిన బీజేపీ హడావుడిగా బెంగళూరు సమావేశం రెండోరోజునే అంటే మంగళ వారం దిల్లీలో ఎన్.డీ.ఎ. సమావేశం ఏర్పాటు చేసింది. తన ఆధిపత్యానికి ముప్పు తప్పదని భయపడుతున్న మోదీకి హఠాత్తుగా ఇన్నాళ్ల తరవాత ఎన్.డి.ఎ. పేరు గుర్తొచ్చింది. 2019 తరవాత ఆయన ఈ పేరెత్తిన సందర్భమే లేదు. ఎన్.డి.ఎ.లో 38 పార్టీలున్నాయని ఆయన గొప్పలు చెప్పు కుంటున్నారు. అయినా 11రాష్ట్రాలలో ప్రతిపక్ష ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయన్న వాస్తవాన్ని ఎట్టకేలకు మోదీకి తెలిసొచ్చినట్టు ఉంది. పట్నాలో జరిగిన ప్రతిపక్ష సమావేశానికి 16 పార్టీలు హాజరైతే బెంగళూరు సమావేశానికి 26 పార్టీలు హాజరు కావడం పెరుగుతున్న మోదీ వ్యతిరేకతకు సంకేతం.