అరుణాచల్లో మళ్లీ బీజేపీ సర్కారు
న్యూదిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. మరోవైపు సిక్కింలో ‘సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం)’ అధికారాన్ని నిలబెట్టుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 60 అసెంబ్లీ సీట్లకుగాను 46 స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగరేసింది. ఎన్పీపీ కేవలం ఐదు స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఇతరులు 8 చోట్ల విజయం సాధించారు. ఎన్నికలకు ముందే 10 అసెంబ్లీ స్థానాలను బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఈ గెలుపుతో బీజేపీ అరుణాచల్లో హ్యాట్రిక్ కొట్టినట్లు అయింది. ఇక సిక్కింలో అధికార ఎస్కేఎం మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకుగాను 31 స్థానాలతో క్లీన్స్వీప్ చేసింది. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్) కేవలం ఒక స్థానానికి పరిమితమైంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాతా తెరవలేదు. ఎన్నికల విజయంపై సీఎం ప్రేమ్సింగ్ తమాంగ్ మాట్లాడుతూ సిక్కిం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మనసుతో ప్రజల కోసం పనిచేశామని, అందుకే గెలిచామని చెప్పారు. మరోవైపు దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్డీఎఫ్ అధినేత పవన్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చెందారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ముఖ్యమంత్రి పెమా ఖండూ ఉన్నారు. తవాంగ్ జిల్లాలోని ముక్తో నుంచి పోటీ లేకుండా నాలుగు పర్యాయాల్లో మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కింలో 79 శాతం పోలింగ్ నమోదు కాగా, అరుణాచల్లో 82.7 శాతం నమోదైంది. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు సిక్కిం ఒక ఎంపీ, అరుణాచల్లోని రెండు ఎంపీ స్థానాలకు జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.
శాసనసభ రద్దు
సిక్కిం 10వ శాసనసభ (ఎస్ఎల్ఏ)ను రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య రద్దు చేశారు. ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడిన క్రమంలో 11వ శాసనసభ ఏర్పాటునకు మార్గం సుగమం చేస్తూ ప్రస్తుత అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి విన్నపాన్ని, మే 28న సమావేశంలో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకొని అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ ఆదేశాలు జారీచేశారన్నారు. జూన్ 2వ తేదీ అర్థరాత్రి నుంచి అసెంబ్లీ రద్దు అవుతుందని రాజ్భవన్ నోటిఫికేషన్ పేర్కొంది. కొత్త సభ త్వరలోనే కొలువుదీరుతుందని అధికారులు వెల్లడిరచారు.