తిరుపతిలో మురళి, విశాఖ పశ్చిమలో విమల, రాజంపేటలో విశ్వనాథ్ నాయక్…
భారీ ప్రదర్శనలు… కూటమి నేతల హాజరు
ఇండియా కూటమి బలపరిచిన సీపీఐ తిరుపతి, విశాఖ పశ్చిమ, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు పి.మురళి, అత్తిలి విమల, బుక్కే విశ్వనాథ నాయక్ శనివారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కదిలిరాగా అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. నామినేషన్ల సందర్భంగా తిరుపతి, విశాఖ, రాజంపేటలో భారీ ప్రదర్శనలు జరిగాయి. డప్పువాయిద్యాలు, నృత్యాలు, ఆటపాటలతో కోలాహలంగా నామినేషన్ కార్యక్రమాలు జరిగాయి. తిరుపతిలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి.హరినాథ్రెడ్డి, విశాఖలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, రాజంపేటలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంఎల్ నారాయణ తదితరులు హాజరయ్యారు.