విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: శాసనసభ సమావే శాల్లో రెండో రోజూ రభస చోటుచేసుకుంది. వ్యవసాయ యాంత్రీకరణ, రైతు బీమా తదితర అంశాలపై తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారామ్ తిరస్కరించారు. దీనిపై చర్చకు అనుమతించాలని వారు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి ముందుగా టీడీపీ శాసనసభ్యులు, మండలి సభ్యులు రైతు సమస్యలపై సభ బయట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘కరువు కాటకాల్లో రైతన్న… కరెన్సీ కట్టల లెక్కల్లో జలగన్న’ అంటూ ప్లకార్డుల ప్రదర్శనతో సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ చేప్టటారు. ఐదేళ్లుగా వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. రైతులకు ఊపిరి లాంటి పంటల బీమాను అటకెక్కించారని, పెట్టుబడి రాయితీ ఊసేలేదన్నారు. రైతులకు క్రాప్ హాలీడే ప్రకటించేలా చేసిన ఘనత సీఎం జగన్దేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోపలా దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. చర్చకు అవకాశం లేదని స్పీకర్ తేల్చిచెప్పడంతో పోడియం చుట్టుముట్టి అజెండా కాపీలు చించి గాల్లోకి ఎగురవేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ‘కాపీ’ కొట్టడమే తెలుగుదేశం పార్టీ కాపీ రైట్..పేటెంట్ రైట్ అని విమర్శించారు. ‘బైబై బాబు’ నినాదాన్ని కాపీ కొట్టి ఇప్పుడు ఆందోళన చేస్తుండడమే అందుకు నిదర్శనమన్నారు. పక్క రాష్ట్రాల్లోని ప్రఖ్యాత పథకాలను తీసుకువచ్చి వాటిని కాపీ చేసి అమలు చేస్తామని టీడీపీ చెప్పడం కాపీకి పరాకాష్ఠ అన్నారు. కేవలం సభ జరగనీయకుండా చేయడమే లక్ష్యంగా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయన్నారు. పేపర్లు చింపి స్పీకర్పై విసిరేసి, గట్టిగా అరవడం కేవలం టీవీల్లో కనబడడం కోసమే తప్ప, ప్రజా సమస్యల పట్ల టీడీపీకి చిత్తశుద్ధిలేదన్నారు. ఆందోళన చేయడానికి ఇష్టపడని టీడీపీ సీనియర్ నాయకులను సైతం బలవంతం చేసి పోడియం దగ్గరకు లాగుతుండడం బాధాకరమన్నారు. ఉపముఖ్యమంత్రి, హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నిమ్మకాయల చినరాజప్ప, అనుభవజ్ఞులైన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి వాస్తవానికి ఆందోళన చేయడం ఇష్టం లేకున్నా టీడీపీ పురిగొల్పుతుందన్నారు. యావత్ రాష్ట్ర ప్రజలు ఎదురుచూసే బడ్జెట్ రోజు ఇలా ఆందోళన చేయడం, అడ్డుపడడం వల్ల సభకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో వారిపై తగు చర్యలు చేపట్టాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, రామరాజు, డోలా బాల వీరాంజనేయస్వామిలను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు బయటకు వెళ్లకుండా స్పీకర్ పోడియం ఎదుట ఆందోళనకు దిగడంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేసి వారిని బయటకు పంపారు. రైతు సమస్యలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమే కాకుండా 10మందిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ సభ్యులు స్పీకర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభతోపాటు కౌన్సిల్లో కూడా తాము రైతాంగ సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చామని, అక్కడ కూడా ప్రభుత్వం చర్చ చేపట్టలేదని, రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే జగన్ రెడ్డి సాధించిన రైతు ప్రగతి అని విమర్శించారు.