న్యూదిల్లీ:పార్లమెంట్లో సరికొత్తగా ఎన్నికైన 18వ లోక్సభ ఈనెల 24న తొలిసారి కొలువుదీరనుంది. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జులై 3వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం, ఇతర కీలక అంశాలపై చర్చలు జరుగుతాయన్నారు. రాజ్యసభ 264వ సెషన్ కూడా 24వ తేదీనే ప్రారంభం కానున్నట్లు వివరించారు. జూన్ 27వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వచ్చే ఐదేళ్లకు ప్రభుత్వ కార్యాచరణను ఆమె వెల్లడిరచనున్నారు. రాష్ట్రపతి గత ప్రభుత్వ విజయాలను తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా తొలి పార్లమెంట్ సెషన్లో ప్రభుత్వాన్ని కొన్ని అంశాల్లో నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. 2024 ఎన్నికలలో బీజేపీ 240 సీట్లలో విజయం సాధించింది. దీంతో మిత్రపక్షాలు జేడీయూ, టీడీపీతో కలిసి ఎన్డీఏ సర్కారును ఏర్పాటుచేసింది. ఇటీవలే ప్రధానిగా నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.